
లాభాలు బాగు..ఆయిల్ పామ్ సాగు
● జిల్లాలో 19,500 ఎకరాల్లో పామాయిల్ తోటలు ● చెరకు, ఇతర పంటలకు ప్రత్యామ్నాయంగా సాగు ● ప్రస్తుతం టన్ను పామాయిల్ ధర రూ.18,650
మాడుగుల రూరల్: చెరకు, సరగుడు, వరి, తదితర సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులకు లాభాలు తెచ్చిపెట్టేది ఆయిల్పామ్ సాగు. వాణిజ్య పంటగా విరాజిల్లుతున్న ఆయిల్పామ్ సాగుతో మెట్ట భూముల్లో జిల్లా రైతులు సిరులు పండిస్తున్నారు. జిల్లాలో పామాయిల్ తోటలు విస్తీర్ణం గత రెండు సంవత్సరాలుగా గణనీయంగా పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 19,500 ఎకరాల్లో సాగవుతుంది. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుంటూ గిరిజన గ్రామాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. పామాయిల్ మొక్క ఖరీదు రూ.133 కాగా, 90 శాతం రాయితీతో రైతులకు అందిస్తున్నారు. రాయితీ సొమ్ము రైతు ఖాతాలో జమ చేస్తున్నారు. గతేడాది టన్ను పామాయిల్ ఫ్రూట్ ధర రూ.22 వేలు ఉండగా.. ప్రస్తుతం టన్ను ధర రూ.18,650 ఉంది. గత నెల టన్ను రూ.20 వేలు వరకు ఉండేది. విదేశాల నుంచి ఆయిల్ దిగుమతి వల్ల ఫ్రూట్ ధర తగ్గినట్టు రైతులు చెబుతున్నారు. రావికమతం, చోడవరం, బుచ్చెయ్యపేట మండలాల్లో 120 ఎకరాల్లో ఈ ఏడాది కొత్తగా ఆయిల్ పామ్ సాగు చేపట్టారు.
గిరిజన గ్రామాల్లో పెరుగుతున్న విస్తీర్ణం
మాడుగుల మండలంలోని గిరిజన గ్రామాల్లో విస్తారంగా సాగు చేస్తున్నారు. తాటిపర్తి, శంకరం, జాలంపల్లి, అవురువాడ, ఎల్.పొన్నవోలు, పొంగలిపాక పంచాయతీల పరిధిలోని శివారు గ్రామాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు. మాడుగుల మండలంలో 913 హెక్టార్లలో సాగవుతోంది. ఒకప్పుడు బీడు భూములుగా ఉన్న ప్రాంతం అంతా నేడు ఆయిల్పామ్ తోటలతో కళకళలాడుతోంది. చెరకు, సరగుడు తోటలు స్థానంలో పామాయిల్ తోటలు వేస్తున్నారు. పామాయిల్ మొక్క వేసిన తర్వాత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలకు కాపునకు వస్తాయి.
రాయితీతో ఆసక్తి
హెక్టారుకు రూ.5,250 చొప్పున నాలుగు సంవత్సరాల పాటు ఉద్యానవన శాఖ ఎరువుల వినియోగానికి రాయితీ సదుపాయం కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం అందిస్తుంది. జిల్లాలో టెనీరా రకం పామాయిల్ను ఎక్కువగా సాగు చేస్తున్నారు. అనకాపల్లి, మాడుగుల, బుచ్చెయ్యపేట, కశింకోట, కె.కోటపాడు, దేవరాపల్లి, రావికమతం, నక్కపల్లి, పాయకరావుపేట, అచ్యుతాపురం, మునగపాక, యలమంచిలి, చీడికాడ, సబ్బవరం, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, కోటవురట్ల, పాయకరావుపేట, నర్సీపట్నం, నాతవరం, మాకవరపాలెం, గొలుగొండ, రాంబిల్లి, రోలుగుంట, తదితర మండలాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. పండిన పామాయిల్ ఫ్రూట్ను కాటాలు వద్ద తూకం వేసిన అనంతరం బంగారుమెట్టతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం, తదితర చోట్ల గల కంపెనీలకు తరలిస్తున్నారు.

లాభాలు బాగు..ఆయిల్ పామ్ సాగు

లాభాలు బాగు..ఆయిల్ పామ్ సాగు