
23న నిరుద్యోగ భృతిపై ధర్నా
అనకాపల్లి: అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, లేని పక్షంలో నెలకు రూ.3 వేలు భృతి ఇచ్చే విధంగా చర్యలు చేపడతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం ఏడాది పాలనలో నెరవేరలేదని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల కన్నబాబు, వియ్యపు రాజు విమర్శించారు. బుధవారం స్థానిక మెయిన్రోడ్డు కోడుగంటి గోవిందరావు భవనంలో నిరుద్యోగ భృతిపై పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగ భృతిపై ఈ నెల 23న స్థానిక నెహ్రూచౌక్ వద్ద నిరుద్యోగులతో ధర్నా చేస్తామన్నారు. 2024 ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గత ప్రభుత్వం నిరుద్యోగులను పూర్తిగా మోసం చేసిందని 40 ఏళ్ల రాజకీయం అనుభవం ఉన్న తనను గెలిపిస్తే రాష్ట్రంలో సంపద సృష్టించి 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తానని, లేని పక్షంలో ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు భృతి ఇస్తానని హామీ ఇచ్చి ఏడాది పాలన పూర్తయిందన్నారు. నిరుద్యోగులకు ఏడాదిపాటు బకాయి పడిన నిరుద్యోగ భృతి ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తూతూమంత్రంగా డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో నాలుగు లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే 16 వేల డీఎస్సీ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం ఏమిటని ప్రశ్నించారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించకపోగా, ఉన్న 2 లక్షల 60 వేల వలంటీర్లను తొలగించారని ధ్వజమెత్తారు. ఎండీయూ వాహనదారులను, పశుసంచార వాహనదారులను ఏడాది పాలనలో తొలగించడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు చంటి, కాసిం, అఖిల్, శ్రావణి, అలేఖ్య, తులసి, తదితరులు పాల్గొన్నారు.