
ఓపెన్ టెన్త్, ఇంటర్కు దరఖాస్తులు
అనకాపల్లి టౌన్: వివిధ కారణాలతో విద్యకు దూరమైన వారి కోసం ఓపెన్ స్కూల్ ద్వారా నేరుగా పదో తరగతి, ఇంటర్మీడియట్లో చేరడానికి జూలై 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఏపీ ఆన్లైన్, మీసేవ కేంద్రాల్లోగానీ జిల్లాలో ఓపెన్ స్కూల్ సహాయ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓపెన్ స్కూల్లో పదో తరగతిలో చేరడానికి ఈ ఏడాది ఆగస్ట్ 31వ తేదీకి 14 సంవత్సరాలు వయసు నిండి ఉండాలన్నారు. వారికి చదవడం, రాయడం వచ్చి ఉండాలన్నారు. దరఖాస్తుతోపాటు ఆధార్ కార్డు, ఏదైనా పాఠశాలలో ఒకటో తరగతిలో చదివిన టీసీ, జన్మదిన ధ్రువపత్రం ఉండాలన్నారు. ఇంటర్లో చేరాలనుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణులైన మార్కుల జాబితా, టీసీ, ఆధార్ కార్డు అందజేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు వారి కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్నారు. రూ.200 అపరాధ రుసుంతో ఆగస్ట్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.