
ఇజ్రాయిల్ దాడులు అమానవీయం
అనకాపల్లి: పాలస్తీనా భూభాగంలో యూదుల వలసలు పెరగడంతో అరబ్బులతో అంతర్గత వర్గ సంఘర్షణ పెరిగిపోయిందని, దీనిపై అగ్రరాజ్యాలు దృష్టి సారించాలని ఇండియన్ సొసైటీ ఫర్ కల్చరల్ కో–ఆపరేషన్ అండ్ ఫ్రెండ్షిప్(ఇస్కఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.మాధవరావు తెలిపారు. ఇస్కఫ్ ఆధ్వర్యంలో స్థానిక వై.విజయకుమార్ హాల్లో మంగళవారం సమీక్షా సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ 20 నెలలుగా ఇజ్రాయిల్ సైన్యం జరిపిన బాంబు దాడుల్లో 55 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారన్నారు. ఆస్పత్రులు, పాఠశాలలు, శరణార్ధ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని మారణకాండ కొనసాగుతుందని, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానం సహా అనేక సంస్థలు యుద్ధం విడనాడాలని గళమెత్తుతున్నా, అమెరికా, మిత్ర దేశాల సహకారంతో నెతన్యాహు ప్రభుత్వం అమానవీయంగా దాడులు కొనసాగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇస్కఫ్ జిల్లా నాయకులు మళ్ల చక్రవర్తి ప్రొఫెసర్ డాక్టర్ ఎం. నూకరాజు, సభ్యులు దావూద్ ఆలీ, బుద్ధ వీరునాయుడు, బొడ్డేడ అప్పారావు, బొట్టా చిన్నియాదవ్, శేఖరమంత్రి సాయిలక్ష్మణ్, మల్లికార్జున రావు, రామచంద్రరావు, కోన లక్ష్మణ పాల్గొన్నారు.