
అసంపూర్తిగా
అగ్రి ల్యాబ్
రైతుల కష్టాలు తీర్చేందుకు..
జిల్లా స్థాయి అగ్రిల్యాబ్ కోసం సబ్బవరంలోని సర్వే నెం.271లో 5 ఎకరాలు కేటాయించారు. సుమారు రూ.6 కోట్ల నాబార్డ్ నిధులతో చేపట్టే ఈ ల్యాబ్ కోసం రూ.3.5 కోట్లతో 14 గదులతో కూడిన భవన నిర్మాణాలను పోలీస్ హౌసింగ్ బోర్డు చేపట్టింది. మిగిలిన రూ.2.5 కోట్లతో అవసరమైన పరికరాలు, ఇతర మౌలికవసతుల ఏర్పాటుకు నిర్ణయించారు. ల్యాబ్కు కేటాయించిన స్థలంలో కొంతమంది ఆక్రమణదారులు ఉండటంతో కాంట్రక్టర్కు స్థలం అప్పగించడంలో జాప్యం జరిగింది. దీని వల్లే గత ప్రభుత్వంలో సకాలంలో ల్యాబ్ అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. నిర్మాణాల పూర్తికి మరో రూ.40 లక్షలు కావాల్సిన సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పూర్తికావస్తున్నా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.
సబ్బవరం: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సేవలన్నీ అందుబాటులోకి తెచ్చింది. పెట్టుబడి సాయం, రాయితీ ఎరువులు, విత్తనాలు, మద్దతు ధర తదితర అన్ని విధాలా రైతుకు అండగా నిలిచింది. అందులో భాగంగానే రైతన్నలు పంట సాగుకు ముందు భూసార పరీక్షలు, విత్తన, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలు తదితరాల కోసం సబ్బవరంలో జిల్లా అగ్రిల్యాబ్ ఏర్పాటుకు సంకల్పించింది. 90 శాతం పనులు పూర్తయిన దశలో ప్రభుత్వం మారడంతో అగ్రిల్యాబ్ సేవలు అందుబాటులోకి రాకుండానే అర్ధంతరంగా నిలిచాయి.
అందుబాటులోకి వస్తే ఎంతో మేలు
ఈ ల్యాబ్ అందుబాటులోకి వస్తే విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, మట్టి నమూనాలను పరీక్షించి, నివేదికలు త్వరితగతిన అందుకునే వీలుండేది. జిల్లా స్థాయి ల్యాబ్లో 12 మంది ఏవోలు, 24 మంది ఏఈవోలకు ఉద్యోగావకాశాలు దక్కేవి. వీరి సాయంతో ఎరువులు, పురుగు మందులు, విత్తనాల నాణ్యతతోపాటు, మట్టి నమూనాలను ఉచితంగానే పరీక్షించి, ఏ భూమి ఏ పంటకు అనుకూలం, విత్తనాలు చల్లక ముందే వాటి నాణ్యత తెలుసుకోవడం ద్వారా నష్ట భయం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ సేవలన్నీ ఉచితం కావడంతో ప్రతి రైతు పంటకు ముందే జాగ్రత్త పడేందుకు వీలుండేది. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల బారిన పడే అగత్యం తప్పుతుంది. ల్యాబ్ అందుబాటులోకి రాకపోవడంతో అంచనా సేద్యంతో రైతులు ఎంతో కొంత నష్టపోతున్నారు.
పంటలో సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులతో పాటు భూసార పరీక్షలకు అవసరమైన ల్యాబ్ వసతి గతంలో ఉమ్మడి విశాఖ జిల్లాలోని జేడీ కార్యాలయంలో ఉండేది. భూసార పరీక్షలు నిర్వహించి రైతులు తమ భూములు ఏ పంటలకు అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవాలంటే విశాఖతోపాటు, నర్సీపట్నంలోని భూసార పరీక్ష కేంద్రాన్ని ఆశ్రయించాల్సి వచ్చేది. సిబ్బంది కొరత, దూరాభారం కారణంగా చాలా మంది రైతులు ఆ దిశగా ప్రయత్నించేవారు కాదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ సేవల్ని చేరువ చేసేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక సమీకృత వ్యవసాయ ప్రయోగశాల ఏర్పాటు దిశగా ప్రతిపాదించారు. జిల్లా మొత్తానికి సబ్బవరంలో ల్యాబ్కు శ్రీకారం చుట్టారు.
5 ఎకరాల్లో.. రూ.6 కోట్లతో..
అందుబాటులోకి రాని జిల్లా స్థాయి అగ్రిల్యాబ్ రూ.6 కోట్ల నాబార్డ్ నిధులతో నిర్మాణం గత ప్రభుత్వంలో 90 శాతంపైగా పనుల పూర్తి కూటమి ప్రభుత్వం వచ్చాక నిలిచిన పనులు
అందుబాటులోకి వస్తే మేలు
వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలైన బొప్పాయి, కాలీఫ్లవర్, టమాటా, ఉల్లి, ఆరటి వంటివి సుమారు 7 ఎకరాల్లో సాగుచేస్తున్నా. ఇందులో కొంత సొంతం. మిగిలినది కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నా. భూసార పరీక్షలు, కల్తీలేని ఎరువులు, విత్తనాల నిర్ధారణకు ఎవరెవరినో ఆశ్రయించాల్సి వస్తోంది. సబ్బవరం అగ్రిల్యాబ్ అందుబాటులోకి వస్తే మాలాంటి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. – చీపురబల్లి బంగార్రాజు,
అమృతపురం గ్రామం
నిధులిస్తే అందుబాటులోకి..
జిల్లా స్థాయి అగ్రిల్యాబ్ నిర్మాణ పనులు 90 శాతం వరకూ పూర్తయ్యాయి. మరో రూ.40 లక్షల నిధులు కావాల్సి ఉంది. ఆ నిధులు విడుదల కాకపోవడంతో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. భవన నిర్మాణం తుది దశకు రావడంతో మౌలిక వసతుల కల్పన, ల్యాబ్కు అవసరమైన పరికరాల విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే అందుబాటులోకి తీసుకొస్తాం.
– బి.మోహన్రావు, జిల్లా వ్యవసాయ అధికారి, అనకాపల్లి

అసంపూర్తిగా

అసంపూర్తిగా

అసంపూర్తిగా

అసంపూర్తిగా