
స్వయం సహాయక సంఘాలు స్వయంశక్తితో నడవాలి
మాడుగుల రూరల్: స్వయం సహయక సంఘాల సభ్యులు స్వశక్తితో పనిచేసి, బ్యాంకులు అందించే రుణ పరపతిని వినియోగించుకుని అధిక రాబడి సాధించాలని జాతీయ జీవనోపాధి మిషన్(ఎన్.ఆర్.ఎల్.ఎం) టీమ్ సభ్యుడు రాజీవ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. కె.జె.పురం జంక్షన్లో గంగాలమ్మతల్లి స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బిక్యూబ్ గార్మెంట్స్(వస్త్రాలు తయారు చేసే షాపు) ను మంగళవారం పరిశీలించి, గ్రూపు సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ బిక్యూబ్ గార్మెంట్స్కు పి.ఎం.ఇ.జి.పి. ద్వారా ఆదనపు ఆదాయం పెంపొందించడం గురించి రూ.5.50 లక్షలు మంజూరు చేశారు. సంఘంలో గ్రూపుల పుస్తకాలు పరిశీలించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులతో నేరుగా మాట్లాడారు. యూనిట్ను నిర్వహిస్తున్న కాళ్ల రాజేశ్వరిని అభినందించారు. యూనిట్ వల్ల వచ్చే ఆదాయం గురించి అమెతో మాట్లాడారు. సెర్ప్ ఆడిషనల్ డైరక్టర్ కె.సరళతో పాటు డాక్టర్ ఆర్. విజయకుమార్, డీఆర్డీఏ ఏపీడీ శ్రీమతి డైజి, మండల ఏపీఎంవో రమణికుమారి, సర్పంచ్ జామి రమణబాబు తదితరులు పాల్గొన్నారు.