
ఘనంగా గంగమ్మ తల్లి మారువారం
మహారాణిపేట (విశాఖ): మత్స్య సంపద సమృద్ధిగా లభించాలని, వేటకు వెళ్లిన మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ మత్స్యకార మహిళలు మంగళవారం భక్తి శ్రద్ధలతో గంగమ్మ తల్లి మారువారం నిర్వహించారు. ఫిషింగ్ హర్బర్లోని గంగమ్మ తల్లి ఆలయం వద్ద కనులపండువగా ఈ కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో మహిళలు కలశాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారి ని దర్శించుకుని, పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘గంగమ్మ తల్లి.. కాపాడమ్మా’అంటూ వేడుకున్నారు. మత్స్యకార సంప్రదాయం ప్రకారం పూజలు చేసి, పసుపు, కుంకుమలను సముద్రంలో నిమజ్జనం చేశారు. గత మంగళవారం గంగమ్మ పండగ నిర్వహించిన అనంతరం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి మత్స్యకారులు వేట ప్రారంభించారు. మారువా రం సందర్భంగా సముద్ర దేవతను పసుపు, కుంకుమలతో డ్రై ఫిష్ మహిళా సంఘం సభ్యులు పూజించారు.