
తల్లికి వందనం..తండ్రులకు పాట్లు
మునగపాక: కూటమి ప్రభుత్వం ‘అమ్మ ఒడి’ పథకం స్థానంలో ప్రవేశపెట్టిన ‘తల్లికి వందనం’ అర్హులందరికీ అందడం లేదు. ఏదో ఒక వంక పెట్టి పథకాన్ని నిలిపివేశారు. అందులో ప్రధానమైనది కరెంటు బిల్లు. 300 యూనిట్లు దాటి వాడితే అనర్హులని నిబంధన పెట్టారు. ఈ నిబంధన అమలు మాత్రం చాలా దారుణంగా ఉందన్న ఆవేదన ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. నెలకు 100, 150 యూనిట్లు వాడే వారిపై సైతం అనర్హత వేటు వేశారని ఆగ్రహం చెందుతున్నారు. తమ విద్యుత్ బిల్లులను పట్టుకొని తండ్రులు విద్యుత్ శాఖ కార్యాలయాలకు వస్తున్నారు. 300 యూనిట్లు ఎప్పుడు వాడామో చెప్పండని అధికారులను నిలదీస్తున్నారు. మునగపాకలోని విద్యుత్ శాఖ కార్యాలయానికి బాధితుల తాకిడి ఎక్కువగా ఉంది. కరెంటు ఎంత వాడామో సరైన నివేదిక ఇచ్చి ‘తల్లికి వందనం’ లబ్ధి వచ్చేలా చూడాలని ఏఈ జగదీష్కు వినతి పత్రాలు అందజేస్తున్నారు. ఈ విషయమై ఏఈ వివరణ ఇస్తూ.. ఎన్ని యూనిట్లు దాటితే పథకం వర్తించదో తమకు తెలీదని, ఈ విషయంలో ఎలాంటి సమాచారం లేదన్నారు. ఏడాది మొత్తంలో విద్యుత్ వినియోగాన్ని సరాసరి చేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. తమకు పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ రాలేదన్నారు.