
ఏఎంసీకి లక్ష్మీకాంతమ్మ పార్థివదేహం
మహారాణిపేట: సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక ట్రస్టీ, అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం వ్యవస్థాపక సభ్యురాలు పేరిచర్ల లక్ష్మీకాంతమ్మ పార్థివదేహాన్ని మంగళవారం ఆంధ్రా మెడికల్ కాలేజీకి దానం చేశారు. దేహదాన మహోద్యమానికి పునాది వేస్తూ, మొత్తం శరీరాన్ని దానం చేసిన తొలి 35 మందిలో పేరిచర్ల లక్ష్మీకాంతమ్మ ఒకరు. ఈమె ట్రస్ట్ వ్యవస్థాపక కోశాధికారి శ్రీహరి రాజు మాతృమూర్తి, ప్రముఖ సంఘ సంస్కర్త, దివంగత పేరిచర్ల సుబ్బరాజు జీవిత భాగస్వామి. లక్ష్మీకాంతమ్మ తెలుగు పండిట్గా పనిచేశారు. ఈ నెల 16న విజయవాడలో పరీక్షలు చేయిస్తుండగా, ఆకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో కన్నుమూశారు. మంగళవారం లక్ష్మీకాంతమ్మ కళ్లను ఎల్.వి.ప్రసాద్ ఐ ఆసుపత్రికి దానం చేయగా, మధ్యాహ్నం 12 గంటలకు ఆమె పార్థివదేహాన్ని ఆంధ్రా మెడికల్ కాలేజీకి అప్పగించారు. కార్యక్రమంలో ఆమె కుమారులు, బంధుమిత్రులు, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు గూడూరు సీతామహాలక్ష్మి, సభ్యులు జి.కన్యాకుమారి పాల్గొన్నారు.