
కట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య
మునగపాక: వివాహేతర సంబంధం అంటకట్టడంతోపాటు అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మునగపాక మండలం గంగాదేవిపేటలో సోమవారం చోటు చేసుకుంది. అత్తింటివారి వేధింపులు వల్లే తన కుమార్తె చనిపోయిందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మునగపాక పోలీసులు సోమవారం రాత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. మునగపాక మండలం గంగాదేవిపేటకు చెందిన బత్తిన పోతురాజు, వరలక్ష్మి దంపతులు కుమారుడు వెంకటేష్కు ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం గ్రామానికి చెందిన కుమారితో ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారి దాంపత్య జీవితంలో భాగంగా కొంతకాలంగా కుమారి అత్త వరలక్ష్మి, మామ పోతురాజు, బావ సంతోషం, తోటికోడలు సాయి తదితరులు తరచూ అదనపు కట్నం కోసం వేధించేవారు. ఈ విషయమై కుమారి తన తల్లికి పలుమార్లు చెబుతూ బాధపడేది. కుమారి భర్త వెంకటేష్ సింగపూర్లో ఉద్యోగరీత్యా ఉంటున్నాడు. వేసవి సెలవులకు ఆమె తన పుట్టింట్లో పిల్లలతో ఉండేది. ఈ క్రమంలో సోమవారం తన పిల్లలను అనకాపల్లిలో స్కూలులో చేర్పించేందుకు అత్తారింటికి వచ్చింది. ఇంతలో ఉరేసుకుని చనిపోయిందంటూ ఆమె మామ ఫోన్లో సమాచారం అందించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్, యలమంచిలి సీఐ ధనుంజయరావు గంగాదేవిపేటలో విచారణ చేపట్టారు. కుమారి మృతదేహాన్ని అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
అత్తింటి కష్టాలే కారణమని
మృతురాలి తల్లి ఫిర్యాదు
గంగాదేవిపేటలో ఘటన

కట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య