
జానకీరాంపురం పీఏసీఎస్లో రూ.2 కోట్ల అవకతవకలపై విచారణ
రోలుగుంట : మండలంలోని జానకీరాంపురంలోని పీఏసీఎస్లో సుమారు రెండు కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయని అందిన ఫిర్యాదుపై సుమారు ఏడాదిన్నర కాలంగా విచారణ సాగుతూనే ఉన్న విషయం విదితమే. మూడు నెలలకు ఒకసారి ఆ శాఖలో ఒకరిని విచారణాధికారిగా నియమించడం నామమాత్ర విచారణ జరపడం, వెళ్లిపోవడం జరుగుతుందే కానీ స్పష్టమైన చర్యలు తీసుకోలేదు. 51 సెక్షన్ ప్రకారం విచారణ చేసి నిగ్గుతేల్చాలని ఫిర్యాదుదారులు డిమాండు చేస్తున్నారు. దీనిలో బాగంగా ఆ శాఖ ఉన్నతాధికారి , ఫిర్యాదుదారులు కిల్లాడ సాంబమూర్తినాయుడు, గొర్లె రాంబాబు, నారాయణరావు, పెదపాటి శ్రీనివాసరావు గత వారం చేసిన ఫిర్యాదు మేరకు చోడవరం డివిజన్ సీనియర్ ఇన్స్పెక్టర్ వి.వి.ప్రసీద్ కుమార్కు విచారణఽ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆయన సోమవారం పీఏసీఎస్కు వచ్చి ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఫిర్యాదు దారులను విచారణ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఈ విచారణలో పాల్గొన్న కిల్లాడ సాంబమూర్తినాయుడు, నారాయణరావు, గొర్లె రాంబాబు, నారాయణరావు, పెదపాటి శ్రీనివాసరావు నిబంధనలకు విరుద్ధంగా సస్పెండైన బి.వి.వి.ఆర్.జె కృష్ణ భార్య జోగులమ్మ పేరున మంజూరైన రూ.2.50 లక్షలు వెంటనే జమ చేయించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. సుమారు 250 మంది సభ్యులకు చెందిన చార్జి డిక్లరేషన్ రుణాల నిగ్గు తేలాలంటే 51 సెక్షన్ విచారణ అమలు చేయాలని డిమాండు చేశారు. భూమిలేకుండా ఇచ్చిన రుణాల బాధితులు, బినామీలు అధిక సంఖ్యలో పాల్గొని తమకు జరిగిన అన్యాయాన్ని విచారణాధికారికి వివరించారు. ఈ సందర్భంగా విచారణలో ఫిర్యాదుదారుల తెలిపిన వివరాలు నమోదు చేయడం జరిగిందని, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని విచారణ అధికారి తెలిపారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు.