
హైస్కూల్ చెంతనే మద్యం షాపు
● విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన ● వేరే చోటకు మార్చాలని చౌడువాడ గ్రామస్తుల డిమాండ్
కె.కోటపాడు: పాఠశాలకు ఫర్లాంగు దూరంలోనే మద్యం షాపు ఉండటం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మరో చోటకు తరలించాలని పలుమార్లు ఎకై ్సజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మండలంలోని చౌడువాడలో జెడ్పీ హైస్కూల్ పశ్చిమ వైపున 40 మీటర్లు దూరంలోనే మద్యం షాపు ఉంది. ఇక్కడ మద్యం కొనుగోలుదారులుతో ఉదయం, మధ్యాహ్నం తీవ్ర రద్దీగా ఉంటోంది. మద్యం షాపు ఉన్న మార్గంలోనే చౌడువాడ, బంటువారి కళ్లాలు, పాచిలవానిపాలెం, పైడంపేట గ్రామాల నుంచి రోజూ విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ఆ సమయంలో మందుబాబులు అనుచితంగా ప్రవర్తించడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఈ నెల 11న కె.కోటపాడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ దాడి ఎరుకునాయుడు, వైస్ ఎంపీపీ రొంగలి సూర్యనారాయణ, ఎంపీటీసీ ఏటుకూరి రాజేష్ ఎకై ్సజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మద్యం షాపును మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు. గతంలోనూ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు గళమెత్తారు. వీటితోపాటు పాఠశాల పేరెంట్స్ కమిటీ సమావేశంలోనూ మద్యం షాపు వేరే చోటకు మార్పు చేయాలని అప్పటి హెచ్ఎం అప్పారావు తీర్మానం చేశారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. వాస్తవానికి తూర్పు వైపు హైస్కూల్ గేటును ప్రామాణికంగా తీసుకుని ఎకై ్సజ్ అధికారులు ఇప్పుడు ఉన్న స్థానంలో మద్యం షాపు ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. పాఠశాల పశ్చిమ వైపు తరగతి గదుల్లోనే విద్యార్థులకు బోధిస్తున్నారు. దాంతో విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా మద్యం షాపును వేరే చోటకు మార్పు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు.
పొలాల్లో మద్యం సీసాలతో ప్రమాదాలు
మద్యం షాపు నుంచి పైడంపేట, పాచిలవానిపాలెం వెళ్లే మార్గాల్లో రాత్రిళ్లు యువకులు, ఇతరులు మందు పార్టీలు చేసుకుంటున్నారు. మద్యం సేవించిన తర్వాత ఈ గ్రామాల వైపు వెళ్లే పొలాల్లో ఖాళీ సీసాలను పారేస్తున్నారు. వాటి పెంకులు గుచ్చుకుని రైతులకు గాయాలవుతున్నాయి. దాంతో ఖాళీ సీసాలు, పెంకులు ఏరివేతకు కూలీలకు ఖర్చు పెట్టాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.
షాపును వేరే ప్రాంతానికి తరలించాలి
రోడ్డుకు సమీపంలో మద్యం షాపు ఉంది. ఈ మార్గంలో పలు గ్రామాల విద్యార్థులు హైస్కూల్కు వెళ్తారు. ఈ మార్గంలో మహిళలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో వారు పడుతున్న ఇబ్బందులపై మండల పరిషత్ సమావేశం దృష్టికి తీసుకెళ్లాను. ఎకై ్సజ్ అధికారులు వేరే ప్రాంతంలో షాపును ఏర్పాటు చేయాలి.
–రొంగలి సూర్యనారాయణ,
వైస్ ఎంపీపీ, పాచిలవానిపాలెం

హైస్కూల్ చెంతనే మద్యం షాపు

హైస్కూల్ చెంతనే మద్యం షాపు