మోసం.. అరాచకం | - | Sakshi
Sakshi News home page

మోసం.. అరాచకం

Jun 17 2025 5:10 AM | Updated on Jun 17 2025 5:10 AM

మోసం.. అరాచకం

మోసం.. అరాచకం

ఏడాది పాలనలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చింది ఇదే..

సూపర్‌ సిక్స్‌ పథకాల పేరుతో వెన్నుపోటు

అమరావతిపై ఉన్న శ్రద్ధ

ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎందుకు లేదు

గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీని మూతపడే స్థాయికి దిగజార్చారు

మాజీ డిప్యూటీ సీఎం బూడి

ముత్యాలనాయుడు ధ్వజం

‘జగన్‌ అంటే నమ్మకం–చంద్రబాబు అంటే మోసం’ పుస్తకావిష్కరణ

దేవరాపల్లి: చంద్రబాబు ఏడాది పాలనలో మోసాలు, అరాచకాలు, అక్రమ అరెస్టులు తప్ప చేసిందేమి లేదని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ రాజకీయ సలహా మండలి సభ్యుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. తారువలో ‘జగన్‌ అంటే నమ్మకం–చంద్రబాబు అంటే మోసం’ పేరిట చంద్రబాబు ఏడాది పాలనలో అరాచకాలు, మోసాలను వివరిస్తూ ప్రచురించిన పుస్తకాన్ని ఆయన సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఏడాది పూర్తయినా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. జగన్‌ పాలనలో ఏడాదిలోనే 90 శాతం హామీలను ఒక్కొక్కటిగా అమలు చేశారని గుర్తు చేశారు. అమరావతిపై ఉన్న శ్రద్ధ వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎందుకు లేదని నిలదీశారు.

యువతపై చిన్నచూపు

టెన్త్‌ పరీక్ష ఫలితాల్లో తప్పులు, తడకలతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారని, విద్యాశాఖ మంత్రి వైఫల్యానికి ఇది నిదర్శనమని ముత్యాలనాయుడు విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన అమలు ఎక్కడని ప్రశ్నించారు. ఉద్యోగాలు కల్పించకుంటే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. జగన్‌ హయాంలో ఆరోగ్యశ్రీలో రూ.25 లక్షల వరకు భరోసా కల్పించగా, ప్రస్తుతం సక్రమంగా అమలు కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు కనీసం మందులు సరఫరా చేయలేని దుస్థితిలో కూటమి ఉందన్నారు. కేంద్రం ఇచ్చే నగదుతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పేరిట ఏటా రైతులకు రూ.20 వేలు ఇస్తామని చెప్పి మాట మార్చడం సరికాదన్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు ఏర్పాటు చేసి ఏరులై పారిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో వారంతా ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీని మూతపడే స్థాయికి దిగజార్చారని, మినీ మహానాడులో ఆ పార్టీ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్వయంగా చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. నిధులు అడిగినా ఇవ్వడం లేదని ఎమ్మెల్యే బాహాటంగా చెప్పారని, ఈ ప్రభుత్వ పాలన తీరుకు అద్దం పడుతుందన్నారు. ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, వైస్‌ ఎంపీపీ పంచాడ సింహాచలంనాయుడు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబూరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వరదపురెడ్డి లలితానాయుడు, ఆర్టీఐ విభాగం జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణ, మండల యువజన అధ్యక్షుడు కర్రి సూరినాయుడు, ఉపాధ్యక్షుడు బండారు దేముడునాయుడు, ఎంపీటీసీలు కోలా గోపి, పోతల వెంకటరావు, సర్పంచ్‌లు రొంగలి వెంకటరావు, నాగిరెడ్డి శఠారినాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement