కేసులు.. వేధింపులు | - | Sakshi
Sakshi News home page

కేసులు.. వేధింపులు

Jun 17 2025 5:10 AM | Updated on Jun 17 2025 5:10 AM

కేసులు.. వేధింపులు

కేసులు.. వేధింపులు

సమాధానం చెప్పలేక ప్రశ్నించిన వారిపై కక్షసాధింపులు

ఘనత వహించిన కూటమి సర్కారు పాలన తీరిది..

మహిళలపై అఘాయిత్యాలు..

క్షీణించిన శాంతిభద్రతలు

ఏ ఒక్క హామీనీ చిత్తశుద్ధితో పూర్తి చేయని చంద్రబాబు

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజం

చోడవరం: ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం తప్ప కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు మేలు చేసిందేమీ లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. ‘జగన్‌ అంటే నమ్మకం..చంద్రబాబు అంటే మోసం’ పేరిట వైఎస్సార్‌సీపీ రూపొందించిన పుస్తకాన్ని చోడవరం పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన ఆవిష్కరించారు. పుస్తక ప్రతులను పార్టీ శ్రేణులకు పంపిణీ చేసి గ్రామాల్లో ప్రజలకు వాటిని చదివి వినిపించి, కూటమి ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేసిందే తెలియజేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్‌ విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ పోరాట ఫలితంగానే తమ ప్రభుత్వం అమలు చేసిన ‘అమ్మ ఒడి’ పథకం పేరు మార్చి ఇటీవల కొనసాగించారే తప్ప వారు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క పథకాన్ని పూర్తిగా అమలు చేయలేదని అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. ఏడాది పాలనలో పరిపాలనను పక్కన పెట్టి ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, హత్యలు చేయించడం, దాడులు చేయడం తప్ప ప్రజల కోసం ఏమీ పనిచేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీకి చెందిన 390మంది నాయకులను కూటమి ప్రభుత్వం హత్య చేసిందన్నారు. అనేక మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగినా పట్టించుకోకుండా రాష్ట్రంలో శాంతిభద్రతలను నిర్వీర్యం చేశారన్నారు. సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసి దౌర్జన్య పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధికి నోచుకోకుండా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఈ పుస్తకంలో తెలియజేశామన్నారు.

అన్నీ అబద్ధాలే..

ఏడాది పాలనలో రూ.1.5 లక్షల కోట్లు అప్పు చేయడం తప్ప రాష్ట్ర ప్రజలకు మాత్రం చంద్రబాబునాయుడు ఏమీ చేయలేదన్నారు. హామీలు గురించి అడిగితే అన్నీ చేసేశానంటూ అబద్ధాలు ఆడుతున్నారన్నారు. మహిళలకు ఇస్తామన్న ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, ఉచిత బస్సు పథకాలు ఏవీ అమలు చేయలేదన్నారు. సంక్రాంతి కల్లా రోడ్లన్నీ బాగుచేస్తామని చెప్పినా ఏమాత్రం పురోగతి లేదన్నారు. ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ఎప్పుడూ పోరాటం చేస్తామని, ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం ఎలా మోసం చేస్తుందో గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తామని అమర్‌నాధ్‌ అన్నారు. అనంతరం కార్యకర్తలతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమకంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏడువాక సత్యారావు, జెడ్పీటీసీలు దొండా రాంబాబు, తలారి ఆదిమూర్తి, ఎంపీపీలు యర్రంశెట్టి శ్రీనివాసరావు, పైల రాజు, పార్టీ జిల్లా యువజన, రైతు విభాగల అధ్యక్షులు పుల్లేటి వెంకటేష్‌, బొడ్డేడ సూర్యనారాయణ, పార్టీ మండల అధ్యక్షులు దొడ్డి వెంకట్రావు, ముక్కా మహలక్ష్మి నాయుడు, కొల్లిమల్ల అచ్చెంనాయుడు, జిల్లా ఉపాధ్యక్షురాలు బొగ్గు శ్యామల పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement