
రిజిస్ట్రేషన్లకూ కరెంట్ కష్టాలు
● సోమవారం మధ్యాహ్నంలోపే
నాలుగైదు సార్లు కోత
● నక్కపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తరచూ విద్యుత్ అంతరాయం
● స్లాబ్ విధానంలో నష్టపోతున్న
కక్షిదారులు
● లావాదేవీల్లో తీవ్ర ఇబ్బందులు
దూర ప్రాంతాల వారికి మరీ ఇబ్బంది
సబ్రిజిస్టార్ కార్యాలయంలో కరెంటు పోతే లావాదేవీలు నిలిచిపోతున్నాయి. స్లాబ్ గడువులోగా రిజిస్ట్రేషన్ జరగకపోతే తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. మరుసటి రోజుకు స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తోంది. స్థానికులకు పర్వాలేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు మరీ ఇబ్బంది పడుతున్నారు. నిత్యం ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగే ఈ కార్యాలయానికి యూపీఎస్లు లేకపోవడం దారుణం.
– కోసూరు శ్రీను, కక్షిదారుడు, నక్కపల్లి
కరెంటు లేకపోతే మేమేం చేస్తాం
కరెంటు లేకపోతే మేమేం చేస్తాం. ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్లు చేస్తాం. కక్షిదారులు ఇబ్బంది పడితే మాకు సంబంధం ఎంటి. మేమేం చేయలేం. యూపీఎస్లు, ఇన్వర్టర్ కొనుగోలు చేయడానికి బడ్టెట్ లేదు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు దృష్టికి తీసుకెళ్లాం.
– సిహెచ్.నర్సింహమూర్తి, సబ్ రిజిస్టార్,
నక్కపల్లి
నక్కపల్లి: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే కక్షిదారులకు సీఎం చంద్రబాబు సర్కార్ కరెంట్ షాక్ ఇస్తోంది. పౌరసేవలు సులభతరం, పాలన వేగవంతంపై ఈ – గవర్నెస్, వాట్సాప్ గవర్నెస్ వంటి సర్వీసులు గురించి పదేపదే ప్రస్తావిస్తున్న ఆయన క్షేత్రస్థాయిలో కరెంటు కష్టాలు తీర్చడం లేదు. పర్యవసానంగా ఎడాపెడా విద్యుత్ కోతలతో భూక్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి. నక్కపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం లోపే నాలుగైదు సార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ఇక్కడ పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది. ఆ సమయంలో గడువులోగా రిజిస్ట్రేషన్ జరగపోతే స్లాట్ రద్దవుతుంది. మళ్లీ బుకింగ్ చేసుకోవడం కక్షిదారులకు ఆర్థిక భారమవుతుంది. దూరాభారం నుంచి వచ్చిన వారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు రోజంతా పడిగాపులు పడాల్సి వస్తుంది.
పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్. రాయవరం మండలాలకు సంబంధించి నక్కపల్లిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. ఇక్కడ భూముల క్రయ విక్రయాలు, బ్యాంకు రుణాలకు సంబంధించిన మార్ట్గేజ్, తనఖా రిజిస్ట్రేషన్లు, జీపీఏ, వివిధ రకాల ఆస్తులకు సంబంధించిన క్రయవిక్రయాలు, వివాహ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతోంది. నిత్యం ఇక్కడ రిజిస్ట్రార్ కార్యాలయంలో 60 నుంచి 70 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. రోజుకు ప్రభుత్వానికి స్టాంప్డ్యూటీ రూపంలో రూ.2 కోట్లపైనే ఆదాయం లభిస్తుంది. మూడు మండలాలకు చెందిన వారే కాకుండా ఏనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి లావాదేవీలు నిర్వహించుకుంటారు. గ్రామీణ జిల్లాలో ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో నక్కపల్లి ఒకటి. ఇంతటి డిమాండ్ ఉన్న ఈ కార్యాలయంలో ఇటీవల కాలంలో కరెంటు కోతలు కక్షిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
సోమవారం ప్రతి అరగంటకొకసారి కరెంటు కోత
రోజుకు కోట్ల ఆదాయం లభిస్తున్న కార్యాలయంలో కనీసం ఇన్వర్టర్, యూపీఎస్గాని, జనరేటర్ సదుపాయంగాని లేదు. విద్యుత్ సరఫరా ఉంటేనే లావాదేవీలు జరుగుతాయి. పొరపాటున కరెంటు పోతే అంతే సంగతులు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు నాలుగైదు సార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రతి అరగంటకొకసారి కరెంటు పోయింది. దీంతో కక్షిదారులు ఇబ్బంది పడ్డారు.
రిజిస్ట్రేషన్ నిలిచిపోతే వర్గ సమీకరణకు ఆపసోపాలు
ఒకొక్కక్క లావాదేవీలకు సంబంధించి చాలా మంది కుటుంబ సభ్యులు, దాయాదులు, వారసులు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇటువంటి ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగే సమయంలో కరెంటు పోతే వారి కష్టాలు వర్ణణాతీతం. అదే రోజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోతే మరుసటి రోజు వీరందరిని సమీకరించడం తలకు మించిన భారంగా మారుతోందని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నక్కపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కేవలం కరెంటు లేకపోవడం వల్లే రిజిస్ట్రేషన్లలో జాప్యం జరుగుతోందని కక్షిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందలాది రిజిస్ట్రేషన్లతో కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చి పెడుతున్న కార్యాలయానికి ఇన్వెర్టర్, జనరేటర్ సదుపాయం లేకపోవడం దారుణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్లాబ్ విధానం కక్షిదారులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సుమారు రెండు నెలల నుంచి నక్కపల్లిలో ఎడాపెడా విద్యుత్ కోతల వల్ల రిజిస్ట్రార్ కార్యాలయంలో లావాదేవీలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ విషయం స్థానిక సిబ్బంది, జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుక్ చేసుకున్న స్లాబ్ గడువులో రిజిస్ట్రేషన్ పూర్తికాకపోతే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా తీవ్ర ఇబ్బందులతోపాటు ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్క నక్కపల్లిలోనే కాదు, జిల్లాలో పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఇదే సమస్య ఉన్నట్లు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కక్షిదారులు చెబుతుండటం గమనార్హం.
కరెంటు పోతే మళ్లీ స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సిందే..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ లావాదేవీల కోసం స్లాట్ బుకింగ్ను ప్రవేశ పెట్టింది. ఆన్లైన్లో రూ.200 చెల్లించి స్లాట్బుక్ చేసుకుంటే కక్షిదారులకు 20 నిమిషాలు సమయం కేటాయిస్తారు. రోజు మొత్తంలో 39 స్లాట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. స్లాట్ గడువులోగానే తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఈ స్లాట్కు కేటాయించిన సమయంలో కరెంటు పోయినా ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినా అంతే సంగతులు. మరో 20 నిమిషాలు అవకాశం ఇస్తారు. ఈ మొత్తం 40 నిమిషాల్లోగా మొదటి స్లాట్ బుక్ చేసుకున్న వారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాకపోతే ఆరోజు వారి లావాదేవీలు నిలిచిపోయినట్లే. తర్వాత స్లాట్ బుక్ చేసుకున్నవారికి అవకాశం ఇస్తారు. మొదటి స్లాట్వారు రోజంతా రిజిస్టార్ కార్యాలయం వద్ద పడిగాపులు పడాలి. లేదా మరుసటి రోజుకు మరో రూ.200 చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు దూర ప్రాంతాల నుంచి లావాదేవీల కోసం వచ్చిన కక్షిదారులకు తమ ప్రాంతాలకు వెళ్లలేక ఇక్కడ ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు.

రిజిస్ట్రేషన్లకూ కరెంట్ కష్టాలు

రిజిస్ట్రేషన్లకూ కరెంట్ కష్టాలు

రిజిస్ట్రేషన్లకూ కరెంట్ కష్టాలు