
ఏడాదిలోనే రూ.1.5 లక్షల కోట్ల అప్పు
● సూపర్ సిక్స్ అమలులో కూటమి ప్రభుత్వం విఫలం ● అక్రమ కేసులతో అరాచకం ● మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్
అనకాపల్లి: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పాలనలో రూ.1.5లక్షల కోట్లు అప్పు చేసిందని, సూపర్ సిక్స్ పథకాలు అమలుచేయడంలో, పాలనలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి , వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.కూటమి ఏడాదిపాలనలో రాష్ట్రంలో చేసిన అరాచకాలపై ముద్రించిన జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని స్థానిక రింగ్రోడ్డు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏడాది పాలనలో 766 మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేశారని, వీరిలో 390 మంది హత్యకు గురయ్యారని చెప్పారు. 203 మంది మహిళలు, చిన్నారులు దాడులు, హత్యాచారాలకు గురయ్యారని, 2,466 మందిపై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. 729 మంది సోషల్ మీడియో యాక్టివిస్టులపై, 63 మంది పాత్రికేయులపై, 73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. 11 మంది పాత్రికేయులపై దాడులు చేశారని చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని ప్రజలు పక్షాన వైఎస్సార్సీపీ పోరాటాలు చేస్తుందని ఆయన తెలిపారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మన రాష్ట్రంలో అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చిన ప్రతి వ్యక్తిపై కూటమి నాయకులు కక్షసాధింపు చర్యలకు పాల్పడం అన్యాయమని, ప్రజలు త్వరలో వారికి బుద్ధి చెబుతారన్నారు. వైఎస్సార్సీపీ నాయకుడు పల్నాడు జిల్లాలో పార్టీకి సేవ చేసినందుకు టీడీపీ నాయకులు ఆ వ్యక్తిని నడిరోడ్డుపై హత్యచేసినప్పటికీ అక్కడ పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. హత్యకు గురైన వ్యక్తి కుటుంబాన్ని మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పరామర్శించి, అండగానిలబడినట్టు చెప్పారు. రాష్ట్రంలో పూర్తిగా శాంతిభద్రతలు గాడి తప్పాయన్నారు.
40 శాతం మందికే తల్లికి వందనం
వైఎస్సార్సీపీ హయాంలో ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకానికి తల్లికి వందనంగా పేరు మార్పు చేసి, రూ.13వేలు ఇచ్చి మిగిలిన రూ.2వేలు టీడీపీ నాయకులు దోచుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో 82లక్షల మంది విద్యార్థులుండగా, 62 లక్షల మంది మాత్రమే ఉన్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారని, వారిలో కూడా 40శాతం మందికి మాత్రమే పథకం వర్తింపజేయడం అన్యాయమన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ నిధులను సీఎం చంద్రబాబు మళ్లించారని చెప్పారు. నిరుద్యోగ భృతి, ప్రతి మహిళలకు నెలకు రూ.1500, మహిళలకు ఉచిత ప్రయాణం పథకాలు ఎప్పడు అమలు చేస్తారో దేవుడికే తెలియాలన్నారు. జిల్లాలో కొండలను పిండి చేస్తూ ఓ ఎంపీ దోచుకుంటున్నారని ఆరోపించారు. లారీలు అధిక లోడుతో ప్రయాణించడం వల్ల జిల్లాలో ప్రమాదాలు జరిగి, ప్రజలు మరణిస్తున్నారని చెప్పారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలని ఆయన కోరారు. 2019–2020 ఏడాది వైఎస్సార్సీపీ పాలనలో 89శాతం బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసినట్టు చెప్పారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలపై వైఎస్సార్సీపీ పోరాటాలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికై నా కక్షపూరిత రాజకీయలు మానుకుని సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యలమంచిలి, నర్సీపట్నం, పాయకరావుపేట, పెందుర్తి నియోజకవర్గాల సమన్వయకర్తలు ఉప్పలపాటి రమణమూర్తిరాజు (కన్నబాబు), పెట్ల ఉమాశంకర్ గణేష్, కంబాల జోగులు, అన్నంరెడ్డి అదీప్రాజు, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి విశాఖ జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఈర్లె అనురాధ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్, జెడ్పీ వైస్చైర్మన్ బి.వి.సత్యవతి, జెడ్పీ కోఆప్షన్సభ్యుడు పెతకంశెట్టి జోసెఫ్, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలిశెట్టి సురేష్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మలసాల కుమార్ రాజా, ఎంపీపీ గొర్లి సూరిబా బు, ఇన్ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ రాష్ట్ర మాజీ చైర్మన్ దంతులూరి దిలీప్కుమార్, పార్టీ జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షుడు పల్లెల సాయికిరణ్, నియోజకవర్గ యువజ విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, 80,84 వార్డుల ఇన్చార్జ్లు కె.ఎం.నాయుడు, కోరుకొండ రాఘవ, అనకాపల్లి, కశింకోట మండలాల అధ్యక్షులు పెదిశెట్టి గోవింద్, మలసాల కిషోర్, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కె.పద్మకుమారి, జిల్లా ఎస్సీ ఎస్టీసెల్ అధ్యక్షుడు సోలం రమేష్, కశింకోట జెడ్పీటీసీ దంతులూరి శ్రీధర్రాజు, కశింకోట ఎంపీపీ కలగగున్నయ్య నాయుడు, పార్టీ నాయకులు పి.డి.గాంధీ, ఉగ్గిన అప్పారావు, కొణతాల మురళీకృష్ణ, దాడి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.