
క్యాన్సర్కు కళ్లెం
విశాఖలో అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేర్ యూనిట్
విశాఖ సిటీ: క్యాన్సర్ కర్కశమైనది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ కబళిస్తోంది. అటువంటి మహమ్మారి పీచమనచడానికి విశాఖ లో అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేర్ బ్లాక్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల క్యాన్సర్ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న అగనంపూడి ప్రాంతంలో ఉన్న హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్(హెచ్బీసీహెచ్ఆర్సీ)లో నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తూర్పు భారత దేశంలోనే అత్యుత్తమ స్పెషలైజ్డ్ క్యాన్సర్ చికిత్సా కేంద్రాల్లో ఒకటిగా నిలిచేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రధానంగా పీడియాట్రిక్, హెమటోలింఫాయిడ్(శిశు, రక్త) క్యాన్సర్ల చికిత్స, పరిశోధనలకు సంబంధించి అతి పెద్ద కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు.
క్యాన్సర్ రోగులకు అనేక సేవలు
ఈ కొత్త బ్లాక్ ద్వారా క్యాన్సర్ రోగులకు అనేక వైద్య సేవలు అందనున్నాయి. ఇందులో ఇంటెన్సివ్ కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, అధునాతన రేడియేషన్ థెరపీ, కార్ టీ–సెల్ థెరపీ లాంటి అధునాతన ఇమ్యునోథెరపీలు, మూడు లీనియర్ యాక్సిలరేటర్లు, ఎంఆర్ఐ, సీవీటీ అండ్ పెట్ స్కాన్లతో పాటు అత్యంత ఆధునిక మెడికల్ ఇమేజింగ్, డయాగ్నోస్టిక్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఇందులో 14 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ గదులు, 14 ఐసీయూలు, 5 ఆపరేటింగ్ థియేటర్లు, పరిశోధనల కోసం ప్రయోగశాలలు, చికిత్స ప్లానింగ్, శిక్షణ కోసం జాయింట్ డిస్కషన్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. పీడియాట్రిక్, హెమటోలింఫాయిడ్ క్యాన్సర్లకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స, బ్లడ్ సెంటర్, పౌష్టికాహారం, పునరావాసం లాంటి సేవలు అందనున్నాయి.