
కార్పొరేట్ పాఠశాలల దోపిడీపై చర్యలు తీసుకోవాలి
ఏఐఎస్ఎఫ్ ఆందోళన
అనకాపల్లి టౌన్ : చదువు పేరుతో వేల రూపాయలు దోచుకుంటున్న కార్పొరేట్, ప్రెవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి జి ఫణీంద్రకుమార్ కోరారు. స్ధానిక నరిసింగరావు పేట నారాయణ కళాశాల ఎదుట శనివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రెండవ శనివారం అయినా క్లాసులు నిర్వహిస్తుండపై ఏఐఎస్ఎఫ్ నాయకులు అభ్యతరం వ్యక్తం చేశారు. తక్షణమే విద్యార్థులను బయటకు పంపాలని నినాదాలు చేశారు. సుమారు 15 నిమిషాలు అనంతరం యాజమాన్యం స్పందించి విద్యార్థులను బయటకు పంపించివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, స్టేషనరీ ఐటమ్స్ అమ్ముతున్న విద్యాసంస్థలపైన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ పేరుతో వారి కళాశాల పాఠశాల పేర్లు ముద్రించి అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా విద్యాశాఖాధికారులు స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రెవేట్ విద్యాసంస్థలపై ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి సింహాద్రి, జిల్లా నాయకులు దేవి ప్రసాద్, సాయితేజ, నాయుడు, శివాజీ పాల్గొన్నారు.