
ప్రశ్నిస్తేనే అవినీతి తగ్గుముఖం
అనకాపల్లి: బాధ్యత, విషయ పరిజ్ఞానంతో సరైన ప్రశ్నలు సంధిస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, అధికార దుర్వినియోగం తగ్గుతుందని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి రాష్ట్ర సలహా కమిటీ సభ్యుడు, ఆర్టీఐ జిల్లా కమిటీ సభ్యుడు కాండ్రేగుల వెంకటరమణ తెలిపారు. గ్రీన్ క్లబ్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక గవరపాలెం గౌరీ గ్రంథాలయంలో ‘సామాజిక సమస్యలు – పరిష్కార మార్గాలు – ఆన్లైన్ వేదికలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సేవల్లో తీవ్ర జాప్యం, అవినీతి, అధికార దుర్వినియోగం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని వాపోయారు. ప్రభుత్వ శాఖల సేవలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉండాలని కోరారు. పౌరుల హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వ సిటిజన్ చార్టర్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రతి శాఖ నిర్దేశిత గడువులో సమస్యలను పరిష్కరించాలన్నారు. అధికార దుర్వినియోగం సామాజిక న్యాయానికి అడ్డుగోడగా నిలుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రజలు డిజిటల్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. న్యాయపరమైన చర్యలు కంటే ముందు సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల కోసం సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవాలన్నారు. గ్రీన్ క్లబ్ వ్యవస్థాపకుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొగ్రాం కో–ఆర్డినేటర్ కాండ్రేగుల సత్యనారాయణ, క్లబ్ ప్రతినిధులు పెంటకోట ఉమా మహేశ్వరరావు, బీరా వినోద్కుమార్, రావూరి అనిత, నైశెట్టి సత్తిబాబు, యల్లపు సూరిఅప్పారావు, మాణిక్యం ఆనంద్, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి రాష్ట్ర సలహా కమిటీ సభ్యుడు వెంకటరమణ