
10 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు
అనకాపల్లి టౌన్ : పట్టణంలోని గూడ్స్ షెడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తుల నుంచి 10 కిలోల గంజాయి, రెండు సెల్ఫోన్లు, రూ.2,250 నగదు స్వాధీనం చేసుకున్నట్టు పట్టణ సీఐ విజయ్కుమార్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న పట్టణ ఎస్ఐ ఈశ్వరావు ఆధ్వర్యంలో గస్తీ తిరుగుతున్న పోలీసులకు రైల్వేస్టేషన్ గూడ్స్షెడ్ వద్ద సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్పై గంజాయి తీసుకువస్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారని తెలిపారు. వారిని వెంబడించి పట్టుకున్నామన్నారు. వీరిలో జి.మాడుగుల మండలం కోడాపల్లి గ్రామానికి చెందిన రామన్ ప్రభాకర్ ఏజెన్సీ ప్రాంతంలో 10 కేజీల గంజాయిని రూ.20 వేలకు కొని తన స్నేహితుడైన తమిళనాడులోని మధురై మండలం ఉసిలంపట్టి గ్రామానికి చెందిన జయవీరన్ కారుతి వీర దేవరతో కలిసి అనకాపల్లి రైల్వే స్టేషన్లో గంజాయిని దించడానికి ఒప్పందం చేసుకున్నాడని తెలిపారు. రామన్ ప్రభాకర్పై అరకు పోలీస్స్టేషన్లో కేసులు ఉండగా, రెండో నిందితుడు వీర దేవర్కు తమిళనాడులో గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నాడన్నారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్టు సీఐ తెలిపారు.