
‘మాన్యువల్ కౌన్సెలింగ్తో ఎస్జీటీలకు అన్యాయం’
నాతవరం : ప్రభుత్వం మాన్యువల్ పద్ధతిలో ఎస్జీటీ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ చేయడం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందని విశ్రాంత ఎంఈవో తాడి అమృత్కుమార్ అన్నారు. ఆయన శనివారం నాతవరంలో విలేకరులతో మాట్లాడారు. హెచ్ఎంలు, ఎస్ఏ ఉపాధ్యాయులకు వెబ్ కౌన్సెలింగ్ చేయడం ద్వారా సమాన న్యాయం జరిగిందన్నారు. యూనియన్ నాయకులు కూటమి నాయకులు నుంచి ఎలాంటి ప్రలోభాలు లేకుండా సక్రమంగా చేసారన్నారు. వెబ్ కౌన్సెలింగ్ వల్ల ఆన్లైన్ ద్వారా హెచ్ఎంలు, ఎస్ఏలకు ఆర్డరు కాపీలు వచ్చాయన్నారు. ప్రస్తుతం ఎస్జీటీలను వెబ్ కాకుండా మాన్యువల్ కౌన్సెలింగ్ వల్ల సీనియర్ మారుమూల ప్రాంతాల్లో పని చేసే ఉపాధ్యాయులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుందన్నారు. కూటమి నేతలు, యూనియన్ నాయకులు అనుచరులకు కావసిన పాఠశాలను దక్కించుకునేలా ప్రక్రియ చోటు చేసుకోవచ్చన్నారు. రోడ్డు పాయింట్ ఉన్న ఖాళీ బయటకు వెల్లడి చేయకుండా చేసేందుకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా వీలుంటుందన్నారు. వారి ఒత్తిళ్లు నడుమ మాన్యువల్ కౌన్సెలింగ్ జరిగే అవకాశం ఉండొచ్చునని అధిక శాతం ఉపాధ్యాయులు వాపోతున్నారన్నారు. వెబ్ కౌన్సెలింగ్ చేయడం వల్ల రోజులు, గంటల తరబడి నిరీక్షణ చేసే ఇబ్బంది ఉండదన్నారు. సీనియారిటీ ప్రకారం వారు కోరుకున్న పాఠశాల కేటాయింపు ఉంటుందన్నారు. వారు అర్డర్ సైతం ఆన్లైన్లో పొందవచ్చునన్నారు. మొదట్లో ప్రభుత్వం హెచ్ఎం, ఎస్ఏలకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి కూటమి పెద్దలు, యూనియన్ నాయకులు ఒత్తిళ్లకు తలొగ్గి ఈ విధంగా చేయడంతో అధిక శాతం ఎస్జీటీ టీచర్లలో వ్యతిరేకత కన్పిస్తుందన్నారు.