ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం

Jun 15 2025 7:57 AM | Updated on Jun 15 2025 7:57 AM

ఖరీఫ్

ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం

చోడవరం: ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ పనులు ముందుగానే ప్రారంభమయ్యాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులంతా నారుమడులు సిద్ధం చేసే పనిలో బిజీ అయ్యారు. గ్రామాలన్నీ వ్యవసాయ పనులతో సందడిగా మారాయి. రైతులు విత్తనాల కోసం వ్యవసాయ కార్యాలయాల వద్ద పడిగాపులు పడే పరిస్థితి లేకుండా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లోనే (ఆర్బీకేలు) ఆన్‌లైన్‌లో తమ ఆర్డర్‌ నమోదు చేసే అవకాశం కల్పించింది. ఈ ఏడాది కూడా ఇప్పటికే రైతులంతా తమకు కావలసిన విత్తనాలను సమకూర్చుకున్నారు. వ్యవసాయ బోర్లు, జలాశయాలు, ఆయకట్టు భూముల్లో రైతులు కొందరు తమ వద్ద ఉన్న సొంత విత్తనాలను ఇప్పటికే నారుమడుల్లో జల్లుతున్నారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 2 లక్షల 20 వేల ఎకరాల్లో వరి సాగు జరుగుతుందని అంచనా వేయగా అదనంగా మరో 3 వేల ఎకరాల వరకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రతి ఆర్బీకేలోనూ రైతులు అదనుకు విత్తనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

బీపీటీ రకాల వైపు రైతుల మొగ్గు

ఈ ఏడాది సాధారణ రకాల వైపు వెళ్లకుండా బీపీటీ రకాలైన సోనామసూరి, ఆర్‌జీఎల్‌ రకాలకే రైతులు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. రైతులు దిగుబడిలో తమకు కావలసింది ఉంచుకోగా మిగతా ధాన్యాన్ని అమ్ముకోవడానికి సిద్ధం చేసుకున్నప్పుడు ఆర్బీకేలు, పీఏసీఎస్‌ల ద్వారా మిల్లర్లను గ్రామాలకు రప్పించి కొనుగోలు చేసే విధానాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో నేటికీ ఆ పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు జరుగుతోంది. వాతావరణం కూడా సకాలంలో అనుకూలించడం, ఆశించిన వర్షాలు కురవడంతో జలాశయాల ఆయకట్టు భూములకు ముందుగానే నారుమడులు వేసుకునేందుకు నీరు విడుదలకు సిద్ధం చేశారు. జిల్లాలో పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతాలైన చోడవరం, మాడుగుల నియోజకవర్గాలతోపాటు పాయకరావుపేట, నర్సీపట్నం, అనకాపల్లి, యలమంచిలి నియోజకవర్గాల పరిధిలో చెరకు, సరుగుడు సాగు చేసే భూముల్లో సైతం ఈ ఏడాది వరి సాగు చేసేందుకు రైతులు సమాయత్తమయ్యారు. జిల్లాలో అన్ని సుగర్‌ ఫ్యాక్టరీలు మూసివేయడం, గోవాడ ఫ్యాక్టరీలో సైతం అనిశ్చిత పరిస్థితి నెలకొనడంతో రైతులంతా వరి సాగుపైనే దృష్టి సారించారు.

వర్షాలతో ప్రారంభమైన నారుమడి పనులు

వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు

వరి సాగు పెరిగే అవకాశం

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి సాగు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. చాలామంది రైతులు సొంత విత్తనాలు సిద్ధం చేసుకోగా, కొత్తగా వరి వేసే రైతులు కూడా ఈ ఏడాది ఆర్బీకేల్లో విత్తనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా 23 వేల 300 మెట్రిక్‌ టన్నుల వరి విత్తనాలకు ప్రతిపాదన పెట్టాం. ఇప్పటికే చాలా వరకు ఆర్బీకేలకు విత్తనాలు సరఫరా చేశాం. చెరకు, సరుగుడుకి ప్రత్యామ్నాయంగా వరిపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. వర్షాలు కురుస్తుండటంతో నారుమడులు కూడా సిద్ధం చేసుకుంటున్నారు.

– బి.మోహనరావు,

వ్యవసాయ శాఖ జిల్లా అధికారి

ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం1
1/2

ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం

ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం2
2/2

ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement