
‘నీట్’గా రాణించారు..
పాయకరావుపేట: వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్)లో జిల్లా విద్యార్థులు రాణించారు. పాయకరావుపేటకు సమీపంలోని బెండపూడికి చెందిన డి.సూర్యచరణ్ జాతీయ స్థాయిలో 59వ ర్యాంకు సాధించాడు. ఆయన 10వ తరగతి శ్రీప్రకాష్లో, ఇంటర్మీడియట్ విశాఖపట్నం నారాయణ కాలేజీలో చదివాడు. న్యూరాలజిస్ట్ కావాలన్నది తన కోరికని తెలిపాడు. మంచి ర్యాంకు రావడంతో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపాడు. తల్లిదండ్రులు ప్రసాద్, రాణి ఒడిశాలో స్థిరపడ్డారు. తండ్రి వ్యవసాయం చేస్తారు.
కార్డియాలజిస్టును అవుతా..
నర్సీపట్నం: నీట్ ఫలితాల్లో కోటవురట్ల మండలం కె.వెంకటాపురానికి చెందిన గొల్లు లహరి 558 మార్కులు సాధించింది. ఆమెకు ఆల్ ఇండియా స్థాయిలో 8878వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 3661 ర్యాంకు వచ్చింది. ఏపీఈఏపీసెట్లో 155వ ర్యాంకు సాధించింది. తండ్రి వెంకట నాగేశ్వరరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి ఉమారత్నం గృహిణి. లహరి పదో తరగతి వరకు నర్సీపట్నంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో, ఇంటర్ విజయవాడలోని ప్రైవేటు కళాశాలలో చదువు పూర్తి చేసింది. నీట్లో మంచి ర్యాంకు రావడం సంతోషంగా ఉందని, ఎంబీబీఎస్ పూర్తి చేసి కార్డియాలజిస్ట్ అవుతానని పేర్కొంది.
మనీషా సాయికుమారికి 3554వ ర్యాంకు
కె.కోటపాడు: నీట్లో చౌడువాడ గ్రామానికి చెందిన రాజి మనీషా సాయికుమారి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఆల్ ఇండియా స్థాయిలో 3554 ర్యాంకు సాధించింది. ఇటీవల వెలువడిన ఏపీఈఏపీ సెట్లో కూడా సాయికుమారి 144వ ర్యాంకు తెచ్చుకుంది. ఆమె పదో తరగతి వరకు కొమ్మాదిలోని జవహర్ నవోదయ స్కూల్లో చదువుకొని 500 మార్కులకు 495 సాధించింది. ఇంటర్లో 986 మార్కులు వచ్చాయి. తల్లిదండ్రులు సత్యనారాయణ, సోనియా వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు.

‘నీట్’గా రాణించారు..

‘నీట్’గా రాణించారు..