పాడేరు: రాష్ట్రంలో గిరిజన సమాజంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు విమర్శించారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీఏ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న గిరిజన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర కలిగిన మారికవలస గిరిజన గురుకుల విద్యాలయాన్ని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ పేరుతో కార్పొరేట్ విద్యా సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ఏకపక్షంగా ఎత్తివేసిందని ఆరోపించారు. ఐటీడీఏ పీవోతో పాటు ఇతర అధికారులు రాత్రికి రాత్రే పోలీసులతో కలిసి విద్యార్థులను బెదిరించి, ట్రంక్ పెట్టెలు, సామానుతో బయటకు పంపించడం దుర్మార్గ చర్య అని విమర్శించారు. ఇలాంటి చర్యలకు గిరిజన సమాజం తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. పాఠశాలను యథావిధిగా కొనసాగించ లేనిపక్షంలో భారీ స్థాయిలో ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.


