ఏయూ క్యాంపస్: కాలుష్యానికి సైక్లింగ్ పరిష్కారంగా నిలుస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. బ్రిక్స్ ఫ్రెండ్షిప్ వేడుకల్లో భాగంగా సండేస్ ఆన్ సైకిల్ పేరిట బ్రిక్స్ దేశాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని ఆదివారం ఉదయం బీచ్రోడ్డులో సైక్లింగ్ చేశారు. సైక్లింగ్ అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. సైక్లింగ్ ‘ఫిట్ ఇండియా’ఉద్యమంలో భాగమన్నారు. భారత ప్రధాని ‘సండేస్ ఆన్ సైకిల్’కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఆదివారం దేశవ్యాప్తంగా దాదాపు 1,800 నగరాల్లో ఈ కార్యక్రమం నిర్వహించగా, 50 లక్షల మంది యువత పాల్గొన్నారని పేర్కొన్నారు. సైక్లింగ్ అద్భుతమైన వ్యాయామమని, దీనివల్ల శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. ప్రతి ఆదివారం ప్రజలు సైక్లింగ్లో పాల్గొనాలని సూచించారు. తద్వారా కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. బీచ్రోడ్డులోని నోవాటెల్ హోటల్ నుంచి సీ హారియర్ వరకు బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, బ్రిక్స్ ప్రతినిధులు, శాప్ ఎండీ భరణి, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఆర్డీవో దిలీప్ చక్రవర్తి, క్రీడా అధికారి జూన్ గ్యాలియట్, యూడీసీ పీడీ సత్యవేణి, కేంద్ర ప్రభుత్వ అధికారులు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.


