నేటి నుంచి జూడాల ఆందోళన తీవ్రతరం
మహారాణిపేట: స్టైఫండ్ పెంపు కోసం గత 14 రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యుల (జూడాలు) పట్ల ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సోమవారం నుంచి తమ నిరసనలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అత్యవసర సేవలను సైతం బహిష్కరించిన వైద్యులు, ఆదివారం కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట రంగురంగుల ముగ్గులు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. జనవరి నుంచి స్టైఫండ్ పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం 3 శాతమే ఇస్తామనడం సరికాదని, ఇతర రాష్ట్రాలతో ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు తీరేవరకు పోరాటం కొనసాగుతుందని ఏపీ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ శిరాజ్, దినకర్ సాయి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆదివారం నాటి రిలే నిరాహార దీక్షల్లో డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ జాహ్నవి, డాక్టర్ సుభాష్, డాక్టర్ విజేత తదితరులు పాల్గొన్నారు.


