కొయ్యూరు: కాకరపాడులో గత రెండేళ్లుగా నిరుపయోగంగా ఉన్న పోస్టుమెట్రిక్ హాస్టల్ భవనాన్ని త్వరలోనే వాడుకలోకి తీసుకువస్తామని ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ తెలిపారు. భవనం శిథిలావస్థకు చేరకుండా ఉండేందుకు, ఏదైనా ఒక విద్యా లేదా ఇతర సంస్థను ఇందులో ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. గురువారం రాత్రి ఆయన బాలికల పోస్టుమెట్రిక్ హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. గతంలో ఇక్కడి బాలుర గురుకుల జూనియర్ కళాశాలలో బాలికలకు కూడా ప్రతి గ్రూపునకు 20 సీట్ల చొప్పున కేటాయించేవారు. దీంతో దాదాపు వంద మందికి పైగా బాలికలు ఈ హాస్టల్లో ఉండేవారు. అయితే, ప్రస్తుతం కళాశాలలో బాలికలకు అడ్మిషన్లు నిలిపివేయడంతో ఈ భవనం వృథాగా మారింది. దీనిపై ఏటీడబ్ల్యూఓ క్రాంతి కుమార్ గతంలోనే ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు.
విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడాలి
అనంతరం గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, అధ్యాపకులతో ఆయన సమావేశమయ్యారు. విద్యార్థులు ఆంగ్ల భాషలో అనర్గళంగా మాట్లాడేలా వారిని ప్రోత్సహించాలని, అందుకు తగిన విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. కళాశాలలో టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ ప్రిన్సిపాల్ సస్పెన్షన్కు గురైన నేపథ్యంలో, అధ్యాపకులంతా క్రమశిక్షణతో వ్యవహరించి విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని ఆయన ఆదేశించారు.
పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ


