మహారాణిపేట (విశాఖ): గిరిజన చట్టాలను గౌరవించాలని, గిరిజన ప్రాంతాల హక్కుల రక్షణలో ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని జెడ్పీ చైర్పర్సన్ జె. సుభద్ర కోరారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గిరిజన వనరుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
పోడియం వద్ద నిరసన
సమావేశం ప్రారంభం కాగానే, అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాకై ్సట్ తవ్వకాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సంబంధించి రహస్యంగా సర్వేలు జరుగుతున్నాయని అనంతగిరి జెడ్పీటీసీ సభ్యుడు గంగరాజు ఆరోపించారు. అరకు, అనంతగిరి, హుకుంపేట మండలాల్లో డ్రోన్లు, హెలికాప్టర్ల వినియోగం, భారీ వాహనాల రాకపోకలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి మద్దతుగా ఈర్లె అనురాధ, పైలా సన్యాసిరాజు, సోము సత్యనారాయణ, సుంకరి గిరిబాబు, దొండా రాంబాబు తదితర సభ్యులు పోడియంను చుట్టుముట్టి, అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. తక్షణమే ఈ సర్వేలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో స్పందించిన చైర్పర్సన్ జె. సుభద్ర, గిరిజనుల హక్కులను కాలరాసే ఏ చర్యకై నా సహకరించవద్దని అధికారులను ఆదేశించారు.
తవ్వకాలపై జీవోలు లేవు: జాయింట్ కలెక్టర్
అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాకై ్సట్ తవ్వకాలకు సంబంధించి ఎటువంటి ప్రభుత్వ కార్యకలాపాలు జరగడం లేదని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ స్పష్టం చేశారు. బాకై ్సట్ తవ్వకాలకు సంబంధించి ఎలాంటి జీవోలు విడుదల కాలేదని, సర్వేలు నిర్వహించేందుకు కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ కార్యాలయం నుంచి ఎటువంటి అనుమతులు జారీ చేయలేదని ఆమె వెల్లడించారు. తప్పుడు సమాచారంతో ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అనంతరం సమావేశంలో పలు ప్రజా సమస్యలపై చర్చ జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందడం లేదని మాడుగుల ఎంపీపీ దాలపురెడ్డి వెంకట రాజారావు ఆరోపించారు. ఎరువులు, విత్తనాలు సరిపడా అందుబాటులో ఉంచాలని చైర్పర్సన్ ఆదేశించారు. పెదబయలు జెడ్పీటీసీ బొంజుబాబు మాట్లాడుతూ పీహెచ్సీల్లో వైద్యులు సమయపాలన పాటించకపోవడంతోపాటు అందుబాటులో ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారని ధ్వజమెత్తారు. అనంతరం ప్రజా సమస్యలపై చర్చించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 108 వాహనాల పనితీరు బాగోలేదని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అల్లూరి జిల్లా డీఎంహెచ్వో పనితీరుపై అసంతృప్తి వ్యక్తం కాగా, ఆయనను సరెండర్ చేయాలని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సూచించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యులు, మందులను అందుబాటులో ఉంచాలని చైర్పర్సన్ సుభద్ర కోరారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, మహిళా సాధికారత, విద్య వంటి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె సూచించారు.
● అక్రమ మైనింగ్, హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుపై గిరిజనులు వ్యతిరేకంగా ఉన్నారని అరకు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం గుర్తు చేశారు. అనంతగిరి మండలంలో ఐదు గ్రామాలను నాన్–షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించడం వల్ల ప్రజలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, అనకాపల్లి కలెక్టర్ విజయ్ కృష్ణన్, విశాఖపట్టం జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో రాజ్ కుమార్, అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
రహస్య సర్వేలు నిర్వహిస్తున్నారంటూ అనంతగిరి జెడ్పీటీసీ గంగరాజు విమర్శ
డ్రోన్లు, హెలికాప్టర్ల వినియోగంపై ధ్వజం
ఆయనకు మద్దతు తెలిపిన సభ్యులు
పోడియం వద్ద బైఠాయించి నిరసన
గిరిజన వనరుల సంరక్షణకు
ప్రాధాన్యత ఇవ్వాలి
అధికారులకు జెడ్పీ చైర్పర్సన్
సుభద్ర సూచన


