ఆర్వో ప్లాంట్ను ప్రారంభిస్తున్న ఆలయకమిటీ సభ్యులు
పాడేరు రూరల్: మన్యం ప్రజల ఆరాధ్య దైవం మోదకొండమ్మ తల్లి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రూ. 1.60 లక్షల వ్యయంతో 500 లీటర్ల సామర్థ్యం కలిగిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆదేశాల మేరకు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు, కమిటీ సభ్యులు చల్ల రామకృష్ణ, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ వంజంగి కాంతమ్మ ఈ ప్లాంట్ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ఈ ప్లాంట్ను ఏర్పాటు చేశామన్నారు. ఆలయంలో వారానికి మూడు రోజుల పాటు అన్నసమారాధనతో పాటు, నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరిన్ని మెరుగైన వసతులు
కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, భక్తులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వెంకటరమణ, చంద్రమోహన్, శంకర్ రావు, హరిబాబు, లక్ష్మయ్య, రమణమ్మ, సత్తిబాబు, స్వరూప, సత్యనారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.


