యలమంచిలి రూరల్: బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును తన ఆటోలో మర్చిపోయిన ప్రయాణికురాలికి తిరిగి ఆ బ్యాగును అప్పగించిన ఆటోడ్రైవర్ను పోలీసులు,సహచర ఆటోడ్రైవర్లు ప్రశంసించారు.అతని నిజాయితీని మెచ్చుకున్న పోలీసులు రూ.500 నగదు బహుమతి అందజేశారు.వివరాలివి..గుంటూరుకు చెందిన మహిళ బత్తుల రమణ యలమంచిలి మండలం ములకలాపల్లిలో ఉన్న తన కుమార్తెను చూసేందుకు వచ్చి, తిరుగు ప్రయాణంలో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు ములకలాపల్లి గ్రామంలో ఆటో ఎక్కింది.యలమంచిలి బస్టాండుకు చేసుకున్నాక తన బ్యాగును ఆటోలో మర్చిపోయి దిగిపోయింది.తర్వాత బ్యాగు మర్చిపోయిన సంగతి గుర్తొచ్చి ఆటో కోసం వెతకసాగింది.సమీపంలో ఉన్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రామారావుకు విషయం చెప్పింది.ఇద్దరూ కలిపి ప్రధాన రహదారిపై ఆటోకోసం వెతుకుతున్న సమయంలో ప్రయాణికురాలు బ్యాగు మర్చిపోయిన ఆటోడ్రైవర్ అక్కడకు వచ్చి నా ఆటోలో ప్రయాణికురాలు బ్యాగు మర్చిపోయిందని హెడ్ కానిస్టేబుల్ రామారావుకు చెప్పాడు. బ్యాగు తనదేనని చెప్పిన ప్రయాణికురాలు రమణకు పట్టణ పోలీసుల సమక్షంలో బ్యాగును అప్పగించారు.బ్యాగులో తులంపావు బంగారు ఆభరణాలు ఉన్నట్టు గుర్తించారు.మర్చిపోయిన బ్యాగును నిజాయతీగా అప్పగించిన ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ అందిబోయిన సత్యనారాయణను పట్టణ ఎస్ఐ సావిత్రి అభినందించారు.
బంగారు ఆభరణాలతో మర్చిపోయిన
బ్యాగు అప్పగింత


