సీలేరు: విత్తన బంతులతో అటవీ సంపద వృద్ధి చెందుతుందని, అంతరించిపోతున్న అడవులు మళ్లీ చిగురించేందుకు ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని సీలేరు అటవీ రేంజ్ అధికారి వెంకటరావు అన్నారు. చింతపల్లి అటవీ డివిజన్ సీలేరు రేంజ్ పరిధిలో బుధవారం పలు ప్రాంతాల్లో విత్తన బంతులను చల్లే కార్యక్రమాన్ని పలు పాఠశాల విద్యార్థులతో కలిసి అటవీ సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి మాట్లాడుతూ పచ్చదనం పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 2.50 కోట్ల విత్తన బంతులు తయారీకి శ్రీకారం చుట్టారని చెప్పారు. చింతపల్లి డివిజన్లో 6.50 లక్షల విత్తన బంతులు తయారు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు.ఇందులో సీలేరు రేంజ్ పరిధిలో 1.20 లక్షల బంతులు తయారు చేసి పలు అటవీ ప్రాంతాలు, పాఠశాలల వద్ద చల్లుతున్నట్టు చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అటవీ సిబ్బంది 1,100 విత్తన బంతులు వేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి రమణమ్మ, సెక్షన్ ఆఫీసర్ సతీష్, ప్రిన్సిపాల్ బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.


