చింతపల్లి: స్థానికప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసర్చ్(ఏడీఆర్)గా డాక్టర్ డి.ఆదిలక్ష్మి నియమితులయ్యారు. అనకాపల్లి నుంచి ఆమె బదిలీపై ఇక్కడకు వచ్చారు. గత మూడేళ్లుగా ఇక్కడ ఏడీఆర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఆళ్ల అప్పలస్వామిని అనకాపల్లి చెరుకు ప్రధాన శాస్త్రవేత్తగా బదిలీ చేశారు. డాక్టర్ ఆదిలక్ష్మి 13 ఏళ్ల పాటు వరి, 12 ఏళ్లపాటు చెరకు పంటలపై పరిశోధనలు జరిపారు. స్థానిక వ్యవసాయ పరిశోధానా స్థానంలో బుధవారం బాధ్యతలు స్వీకరించిన ఆమెకు శాస్త్రవేత్తలు,కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి మాట్లాడుతూ గిరిజన ప్రాంత రైతులకు అవసరమైన సాంకేతిక విజ్ఞానం,యాంత్రీకరణ,విలువలు జోడింపు వంటి అంశాలపై పరిశోధనలు జరిపి వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సీనియర్ శాస్త్రవేత్తలు బయ్యపురెడ్డి ,బాలహుస్సేన్ రెడ్డి,సందీప్ నాయక్,వెంకటేష్,జోగారావు, టీచింగ్ అసోసియేట్ బాపూజీ తదితరులు పాల్గొన్నారు.


