అనకాపల్లి : బడుగు, బలహీన ప్రయాణికులు రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్లను దశలు వారిగా ప్రభుత్వం నిర్వీర్యం చేసి, కొత్తగా విద్యుత్ బస్లను ప్రవేశపెట్టి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అన్యాయమని, విద్యుత్ బస్ను ఆర్టీసీలో కొనసాగించాలని ప్రజారవాణాశాఖ ఉద్యోగుల సంఘం(జేఏసీ) రాష్ట్ర ప్రచార కార్యదర్శి జి.శంకరరావు అన్నారు. స్థానిక డిపో వద్ద బుదవారం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఎర్రబ్యాడ్జీలు ధరించి, మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ బస్లను ఆర్టీసీ వారే నిర్వహించాలని, మూసివేసిన డిపోలను తక్షణమే తెరిపించాలని, ఫినాజిల్ కంపెనీలో ఒప్పందాలు రద్దు చేయాలని, ఉద్యోగులకు కొత్త పీఆర్సీ కమిటిని ఏర్పాటు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని, బకాయిపడ్డ నాలుగు డీఏలు చెల్లించాలని, కొత్తగా నాలుగువేల బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేసి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజేసీ నాయకులు కె.ఎన్.వి.రమేష్, వై.వి.ఎస్.కుమార్, టిఏ.రాజు, ఎల్యూఆర్.బాబు, జి.వి.రమణ, డి.ఎన్.మూర్తి, బి.ఎ.రావు, టి.టి.మూర్తి పాల్గొన్నారు.


