నిప్పుల గుండంలో
‘సహజ వనరుల దోపిడీకి కుట్ర’
డుంబ్రిగుడ: ఆదివాసి గిరిజనులను అడవుల నుంచి తరలికొట్టేందుకు మోదీ, చంద్రబాబు ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.అప్పలనరస విమర్శించారు. డుంబ్రిగుడలోని సామాజిక భవనంలో సీపీఎం మండల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలతో కుమ్మకై ఆదివాసుల అడవులు, భూములు, సహజ వనరులను దోచుకోవడానికి కుట్ర చేస్తున్నాయని దుయ్యబట్టారు. జిల్లాలో ఒక్క లబ్ధిదారుడికి కూడా అటవీ హక్కుల పట్టాలు మంజూరు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పారు. అనుమతి లేకుండా ఎలాంటి సర్వేలు నిర్వహించినా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు టి.సూర్యనారాయణ, పోతురాజు, సురేష్, డొంబు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రమాదం జరిగిన ప్రదేశం ఇదే
పరవాడ : ఆ తెల్లవారుజాము వారిద్దరూ ఎప్పటిలాగే తమ విధుల్లో మునిగిపోయారు. కుటుంబాలను సాకుతున్నామన్న తృప్తి, రేపటి జీవితంపై ఎన్నో ఆశలు.. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆ పరిశ్రమే వారికి చితిగా మారింది. పరవాడ జేఎన్ ఫార్మాసిటీ సమీపంలోని ఇండస్ట్రీయల్ పార్క్(ఏపీఐఐసీ జోన్–3)లో గల ’దక్షిణ్ ఎనర్జీ’ పరిశ్రమలో మంగళవారం తెల్లవారుజామున సంభవించిన ఘోర అగ్నిప్రమాదం ఇద్దరు యువ కార్మికులను సజీవ దహనం చేసింది. ఈ హఠాత్పరిణామంతో అనకాపల్లి జిల్లాలోని రెండు గ్రామాలు ఒకేసారి కన్నీటి సముద్రంలో మునిగిపోయాయి.
క్షణాల్లో జరిగిన ఘోరం
ప్లాస్టిక్ పైరోలిసిస్ ఆయిల్, ఇంధన నూనెలను తయారు చేసే ఈ పరిశ్రమను గతేడాది సెప్టెంబరులోనే ప్రారంభించారు. సోమవారం రాత్రి షిఫ్ట్ విధులకు హాజరైన ఆపరేటర్ వేపాడ వెంకటేష్(34), ఫిట్టర్ బోడపు త్రినాథ్(24)లు మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో రియాక్టర్ వద్ద ప్రాసెసింగ్ పనిలో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక రియాక్టర్ పైపులైన్ నుంచి గ్యాస్ లీకై ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి షెడ్డు పైకప్పు ఎగిరిపోయింది, గోడలు బీటలు వారాయి. క్షణాల వ్యవధిలో పరిశ్రమను దట్టమైన మంటలు అలుముకున్నాయి. రియాక్టర్ వద్దే ఉన్న వెంకటేష్, త్రినాథ్లు తప్పించుకునే లోపే మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.
గుండెలు పగిలేలా రోదనలు
ఈ ప్రమాదం సృష్టించిన బీభత్సం ఒకవైపు అయితే, మృతుల కుటుంబాల గాథలు కంటతడి పెట్టించాయి. పరిశ్రమ గేటు వద్ద తల్లిదండ్రులు, భార్య, బంధువుల రోదనలు చూసిన ప్రతి ఒక్కరి హృదయం కదిలిపోయింది.
అధికారుల సందర్శన : ప్రమాద వార్త తెలియగానే పరవాడ డీఎస్పీ మోహన్రావు, సీఐ భాస్కరరావు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనకాపల్లి జేసీ శౌర్యమాన్ పటేల్, ఆర్డీవో ఆయేషా, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివశంకర్రెడ్డి పరిశ్రమను సందర్శించి ప్రమాద కారణాలను తెలుసుకున్నారు.
మృతదేహాలకు కేజీహెచ్లో పోస్టుమార్టం
మహారాణిపేట: ‘దక్షిణ్ ఎనర్జీ’ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ఇద్దరు కార్మికులు వేపాడ వెంకటేష్, బొడ్డాపు త్రినాథ్ల మృతదేహాలకు మంగళవారం కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించారు. తెల్లవారుజామున ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలంలోనే మృతదేహాలకు పోలీసులు పంచనామా పూర్తి చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అడవుల సంరక్షణతోనే మనుగడ
ముంచంగిపుట్టు : భవిష్యత్తు తరాల మనుగడకు అడవులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సీహెచ్.నారాయణపడాల్ అన్నారు. మండలంలోని కిలగాడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఇంగ్లిష్ మీడియం బాలుర పాఠశాలలో మంగళవారం ముంచంగిపుట్టు రేంజ్ ఫారెస్టు అధికారులు ఏఎస్ఆర్ అరణ్య కార్యక్రమం నిర్వహించారు. అడవుల సంరక్షణ, ప్రాముఖ్యత, ఉపయోగాలు, జీవవైవిధ్యంలో మొక్కలు, జంతువుల సముతుల్యతపై అవగాహన కల్పించారు. నారా యణ పడాల్ మాట్లాడుతూ ఖాళీ ప్రదేశాల్లో, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం ద్వారా అటవీ విస్తీర్ణాన్ని పెంచవచ్చునన్నారు. వర్షాలు పడటానికి, భూగర్భ జలాలు పెరగడానికి అడవులు దోహదపడతాయని చెప్పారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు బి.వెంకటపతిరాజు, కార్తీక్, ఉపాధ్యాయులు భగత్రామ్, ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.


