ముంచంగిపుట్టు : క్షేత్ర స్థాయిలో పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ అమలు పరిశీలన కోసం మంగళవారం రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ అడిట్ బృందం సభ్యులు విజయవాడ నుంచి వచ్చి ముంచంగిపుట్టు మండలంలో పర్యటించారు. దారపల్లి, సరియాపల్లి, కిందుపుట్టు, పోలీపుట్టు, సగ్గులు, జర్రెల ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులు చదవడం, రాయడం, ప్రాథమిక గణితం వంటి కనీస నైపుణ్యాలపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ఎంత వరకు అమలు జరుగుతుంది అనే దానిపై ఆరా తీశారు. 3వ తరగతి పిల్లల్లో సార్వత్రిక పునాది అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం సాధించేందుకు చేపడుతున్న కార్యక్రమాలపై అంచనా వేశారు. అంగన్వాడీ కేంద్రాలను సైతం తనిఖీలు చేసి మౌలిక వసతులు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, కేంద్రాలలో బోధనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆడిట్ అఫీసర్ ఎల్.సత్యనారాయణ మాట్లాడుతూ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం పాఠశాలల్లో అమలుపై ఈ నెల 28వ తేదీ వరకు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తామన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో తనిఖీలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ అసిస్టెంట్ అడిట్ అఫీసర్లు హెచ్.సుమన్, మానుయాదవ్, ఎంఈవోలు కృష్ణమూర్తి, త్రినాథ్, సీఆర్పీలు పాల్గొన్నారు.


