● ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆదేశం
● పాఠశాల సంసిద్ధతపై సమీక్ష
పాడేరు : విద్యార్థుల ఆరోగ్యం, పాఠశాల పరిశుభ్రత, విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుపై ఏటీడబ్ల్యూవోలు, హెచ్ఎంలు, గురుకులాల ప్రిన్సిపాళ్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆదేశించారు. మంగళవారం ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గిరిజన గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఏటీడబ్ల్యూవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన తీరు, మధ్యాహ్న భోజనం మెనూ, పాఠశాల పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యం, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల నమోదు పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించాలన్నారు. ఉపాధ్యాయులు కూడా క్రమశిక్షణతో మెలగాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని పీవో హెచ్చరించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు పరిమల, ఏటీడబ్ల్యూవోలు, హెచ్ఎంలు పాల్గొన్నారు.


