అరకులోయ టౌన్ (పాడేరు రూరల్): బస్కి పంచాయతీ పరిధిలోని బొండగుడ గ్రామంలో విషజ్వరాలు తీవ్రంగా విజృంభిస్తున్నాయి. గత వారం రోజులుగా ఈ జ్వరాల బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ, నేటికి 15కి చేరిందని వైస్ ఎంపీపీ కిల్లో రామన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే బాధితుల సంఖ్య పదులకు చేరుకుందని ఆరోపించారు. ఇప్పటికే బస్కి పంచాయతీ పరిధిలో మలేరియా నివారణ చర్యలు చేపట్టాలని కోరినా, అధికారులు స్పందించలేదని మండిపడ్డారు. పారిశుధ్య లోపం కారణంగా దోమలు, ఈగల సంతతి పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికై నా సంబంధిత వైద్యాధికారులు స్పందించి, బస్కి పంచాయతీ కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని, బాధితులకు తగిన పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు.


