తుమ్మపాల: బాధితుల ముఖంలో నవ్వే పోలీసు వ్యవస్థకు అసలైన కొలమానమని ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో స్వయంగా ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదుపై గరిష్టంగా వారం రోజుల్లోపు విచారణ పూర్తి చేసి బాధితుడికి న్యాయం చేయాలన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, కేవలం నిజాల ఆధారంగా పారదర్శకంగా దర్యాప్తు జరగాలన్నారు. స్టేషన్లో కేసు ఏ దశలో ఉందో బాధితులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వారిలో నమ్మకం నింపాలని, విచారణ ముగిసిన వెంటనే తీసుకున్న చర్యలపై పూర్తి నివేదికను జిల్లా కార్యాలయానికి పంపాలన్నారు. ముఖ్యంగా మహిళల రక్షణ, భద్రత విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని, మహిళలను, సామాన్యులను మోసగించే వారిపై చట్టపరంగా ఉక్కుపాదం మోపుతామన్నారు. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి తమ సమస్యలను తెలియజేయవచ్చని, ప్రజలకు అండగా నిలవడానికి పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ వారం మొత్తం 60 ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపారు.


