అరకులోయ టౌన్ (పాడేరు రూరల్): స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 91 అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్ నిషాంతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్, రెవెన్యూ, విద్య, ఆర్డబ్ల్యూఎస్, సివిల్ సప్లయ్, విద్యుత్, శిశు సంక్షేమం, ఇరిగేషన్, రవాణా, సమగ్ర శిక్ష, హౌసింగ్, రోడ్లు–భవనాల శాఖ, పర్యాటక శాఖలకు సంబంధించి అత్యధికంగా వినతులు అందాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. చిన్నలబుడు పంచాయతీ మాలివలసలో జలధార–జలహారతి పనులను కలెక్టర్ ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో సాగునీటి పనులను చేపడుతున్నామని, దీనివల్ల గిరిజన కూలీలకు ఉపాధి లభించడమే కాకుండా భూగర్భ జలాలు పెరుగుతాయని ఆమె వివరించారు. సుంకరమెట్ట పంచాయతీ కె.బెడ్డగుడలో రూ. 31.91 లక్షల సీఎస్ఆర్ నిధులతో ఆధునీకరించిన మండల పరిషత్ పాఠశాల భవనాన్ని కలెక్టర్ ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన దివీస్ ఫార్మా సంస్థ ప్రతినిధులను అభినందిస్తూ, ఇటువంటి సేవలు మరిన్ని గిరిజన గ్రామాలకు విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, పంచాయతీరాజ్ ఈఈ కొండయ్య పడాల్, ఎంపీడీవో ప్రసాద్, తహసీల్దార్ రాజా శ్రీధర్, ఎంఈవో భారతీరత్నం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ నిశాంతి


