సాక్షి,పాడేరు: ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారి సౌకర్యం లేక గిరిజనులు ఇప్పటికీ డోలిమోతలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఆపద సమయంలో వాహనాలు వచ్చే అవకాశం లేక, రోగులను ఆసుపత్రులకు తరలించేందుకు గిరిజనులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అనంతగిరి మండలం, గుమ్మ పంచాయతీలోని మారుమూల గ్రామం కర్రిగుడకు చెందిన బడ్నాయిని కుమార్ (48), శనివారం మధ్యాహ్నం పశువులు కాస్తుండగా పిడుగుపాటుకు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అంబులెన్స్ వచ్చే అవకాశం లేకపోవడంతో, గ్రామస్తులు ఆయనను డోలీలో మోస్తూ సుమారు 5 కిలోమీటర్ల దూరం కాలినడకన నిమ్మఊట గ్రామం వరకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి 108 వాహనంలో ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించడంతో ఆయన ప్రాణాపాయం తప్పింది. తమ గ్రామానికి సరైన రహదారి లేకపోవడం వల్లనే ఇటువంటి దుస్థితి ఏర్పడుతోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


