సాక్షి, అనకాపల్లి: విశాఖ రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 490 కేసుల్లో పట్టుబడిన 20,870 కిలోల గంజాయి, ఇతర మత్తు పదార్థాలను పోలీసులు పరవాడలోని కోస్టల్ వేస్ట్మేనేజ్మెంట్ ప్లాంట్లో గురువారం ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ రేంజ్ డీజీపీ గోపీనాథ్ జట్టి ఐదు జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.
భారీగా రికవరీలు : విశాఖ రేంజ్ పరిధిలో పోలీసులు గంజాయి నెట్వర్క్లపై ముమ్మరంగా దాడులు నిర్వహించారు. 1,142 కేసులు నమోదు చేసి, 3,377 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి 65,560 కిలోల గంజాయి, 83.19 కిలోల హషీష్ ఆయిల్ను స్వాధీనం చేసుకుని, రవాణాకు ఉపయోగించిన 832 వాహనాలను సీజ్ చేశారు. 19 కేసుల్లో 18 మంది నిందితులకు చెందిన రూ.11.02 కోట్ల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేశారు.
అంతర్జాతీయ, అంతరాష్ట్ర ముఠాల గుర్తింపు
శ్రీలంక డ్రగ్స్ మాఫియాతో సంబంధమున్న అంతర్జాతీయ ముఠా కార్యకలాపాలను అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా నేతృత్వంలో పోలీసులు ఛేదించి, రూ.1.07 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో అంతరాష్ట్ర ముఠాను పట్టుకుని, రూ.1.04 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ల సాయంతో 144 హాట్స్పాట్లను గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 28 స్టాటిక్, 480 డైనమిక్ చెక్పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, విజయనగరం ఎస్పీ ఏ.ఆర్.దామోదర్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు పాల్గొన్నారు.


