● ఊటగెడ్డ వద్ద గిరిజనుల నిరసన
అరకులోయ టౌన్/పాడేరు రూరల్: తమ గ్రామంలో తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గురువారం ఊటగెడ్డ వద్ద బొందుగూడ గ్రామస్తులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకుడు పొట్టంగి శ్రీను మాట్లాడుతూ, గ్రామంలో తాగునీటి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన బోర్లు, బావులు, రక్షిత తాగునీటి పథకాలు లేకపోవడంతో, గ్రామస్తులు మైళ్ల దూరం వెళ్లి ఊటగెడ్డల వద్ద దొరికే బురద నీటిని తాగక తప్పడం లేదని తెలిపారు. కలుషితమైన ఆ నీటిని వినియోగించడం వల్ల ప్రజలు తరచూ వ్యాధుల బారిన పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అబద్ధపు హామీలు ఇచ్చిన నాయకులు, గెలిచిన తర్వాత తమ కష్టాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కూటమి నాయకులకు ప్రజల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తక్షణమే స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కన్నయ్య, రాధమ్మ, అప్పలరాజు, స్వప్న, బాబూరావు, రాములమ్మ పాల్గొన్నారు.


