గొండుపాలెం సచివాలయం వద్దరైతుల నిరసన
కె.కోటపాడు: గొండుపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు భూములను ఇవ్వబోమని రైతులు స్పష్టం చేశారు. సీపీఎం నాయకులతో కలిసి గ్రామ సచివాలయం వద్ద గురువారం నిరసన చేపట్టారు. అనంతరం పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రాన్ని అందించారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకన్న మాట్లాడుతూ గొండుపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కుకు మే 25న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శంకుస్థాపన చేశారన్నారు. ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని, ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభ నిర్వహించలేదన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించి ఇటువంటి చర్యలకు పాల్పడడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎన్నోయేళ్ల నుంచి సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న రైతులు భూములు కోల్పోవడం వల్ల రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు ప్రయత్నం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు మణి, ఈశ్వరరావు, దొగ్గ మహేష్, భారతి, తారకేశ్వరరావు పాల్గొన్నారు.


