హింసాత్మక ఘటనల్లో ఆ ముగ్గురు కీలకం | - | Sakshi
Sakshi News home page

హింసాత్మక ఘటనల్లో ఆ ముగ్గురు కీలకం

Jun 20 2025 5:41 AM | Updated on Jun 20 2025 5:41 AM

హింసాత్మక ఘటనల్లో ఆ ముగ్గురు కీలకం

హింసాత్మక ఘటనల్లో ఆ ముగ్గురు కీలకం

● మావోయిస్టులు గాజర్ల రవి, అరుణక్క, అంజూపై 322 కేసులు ● కింటుకూరు అటవీ ప్రాంతంలో ఆత్మరక్షణ కోసం పోలీసుల ఎదురు కాల్పుల్లో వారు మృతి ● వారిపై రూ.46 లక్షల వరకు రివార్డు ● అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్‌ వెల్లడి

ఆరిలోవ (విశాఖపట్నం): అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధి కింటుకూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన ముగ్గురు మావోయిస్టులు పలు హింసాత్మక ఘటనల్లో క్రియాశీలక పాత్ర పోషించారని ఆ జిల్లా ఎస్పీ అమిత్‌బర్దర్‌ తెలిపారు. నగరంలోని విశాలాక్షి నగర్‌ ప్రాంతం కై లాసగిరి ఏఆర్‌ కార్యాలయంలో గురువారం ఆయన అడిషినల్‌ ఎస్పీ ధీరజ్‌ కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసు బలగాలపై ఉదయం 7 గంటల సమయంలో ఆకస్మాత్తుగా మావోయిస్టులు కాల్పులు జరిపారన్నారు. వెంటనే పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ కాల్పుల్లో సీపీఐ(మావోయిస్టు) పార్టీకి చెందిన ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు మృతి చెందినట్లు వెల్లడించారు. వీరు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి, అలియాస్‌ ఉదయ్‌, ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యురాలు అరుణ, అలియాస్‌ అరుణక్క, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఏసీఎం క్యాడర్‌ మహిళా మావోయిస్టు అంజూగా నిర్థారించినట్టు తెలిపారు. జిల్లాలో గాజర్ల రవి, అరుణ ఒకొక్కరిపై ఇప్పటివరకు 150కు పైగా కేసులు, అంజూపె 22 కేసులు ఉన్నట్లు తెలిపారు. గాజర్ల రవిపై రూ.25 లక్షలు, అరుణపై రూ.20 లక్షలు, అంజుపై రూ. లక్ష రివార్డు ఉన్నాయన్నారు. ఘటనా స్థలంలో మూడు ఏకే 47, కిట్‌ బ్యాగులు, ఖాళీ తూటాలు, నగదు, మావోయిస్టుల సాహిత్యం, గ్రీన్‌ దుస్తులు, ఇతర సామగ్రి లభించాయన్నారు. ముగ్గురు మావోయిస్టులు ఇటీవల వై.రామవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధి సేషరాయి, మంప పోలీస్‌ స్టేషన్‌ పరిధి కాంటవరం, కాకులమామిడి వద్ద జరిగిన ఎదురు కాల్పుల నుంచి తప్పించుకున్నారని ఎస్పీ వెల్లడించారు. అరకు మాజీ ఎమ్మెల్యే హత్య కేసు, అన్నవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కోటగున్నల బ్లాస్టింగ్‌, బలిమెల ఘటన తదితర కేసుల్లో పాల్గొన్నట్టు ఆయన వివరించారు. మావోయిస్టులు ముగ్గురు మృతిపై రంపచోడవరం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement