లక్సెట్టిపేట: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మున్సిపాలిటీ పరిధిలోని భగత్సింగ్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల మేరకు కాలనీకి చెందిన గుర్రాల జయాకర్ (40) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. వద్దని చెప్పినా వినకపోవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అతని సోదరులకు ఫోన్ చేసి నాకు బతకడం ఇష్టం లేదని చెప్పి కాలనీ సమీపంలోని చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుని సోదరుడు చంద్రమౌళి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
లక్ష్మణచాంద: మనస్తాపంతో మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని బోరిగాం తండాకు చెందిన రాథోడ్ శోభ (31) శుక్రవారం ఇదే గ్రామానికి చెందిన కొందరు మహిళలతో గొడవ పడింది. దీంతో మనస్తాపం చెంది శనివారం ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లింది. కుటుంబ సభ్యులు వెతికే క్రమంలో గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్ద పాదరక్షలు కనిపించాయి. అనుమానంతో బావిలో గాలించగా మృతదేహం లభ్యమైంది. మృతురాలి తల్లి మీరాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రావణి తెలిపారు.
మద్యానికి బానిసై
ఒకరు బలవన్మరణం