నార్నూర్: గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు సహకరించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు. మండలంలోని గుండాల గోండుగూడలో శనివారం ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గంజాయి సాగు చేస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేసేలా సంబంధిత శాఖలకు సిఫార్సు చేస్తామన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్లో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థులకు 50 పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న గుండాల గోండుగూడకు త్వరలో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆదిలాబాద్కు చెందిన వైద్యులు జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, గైనకాల జీ, ఆప్తమాలజీ, డెంటల్, పీడియాట్రిక్ విభాగాల్లో సుమారు 200 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రుత్విక్ సాయి, నార్నూర్ సీఐ అంజమ్మ, ఎస్సై శ్రీ సాయి, గాదిగూడ ఎస్సై రమ్య, వైద్యులు అశోక్, రమా అశోక్, గోపాల్, తౌఫిక్, వంశీ, చంద్రకాంత్, సర్పంచ్ రాథోడ్ సురేష్ పాల్గొన్నారు.


