పీపీపీ విధానంతో ఆరోగ్య భద్రత దూరం
● చంద్రబాబు ప్రభుత్వ తీరు దారుణం
● మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు
● భోగిమంటల్లో ప్రతుల దహనం
రాజమహేంద్రవరం రూరల్: పేదల ఆరోగ్య భద్రతను దూరం చేసేందుకే చంద్రబాబు ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తోందని (పీపీపీ విధానం) వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. బొమ్మూరులోని బాలాజీపేట సెంటర్లో బుధవారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొందేశి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన వేణు, పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు, పార్టీ పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, హిందూపురం నియోజకవర్గ ఇన్చార్జి వేణు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు భోగిమంటల్లో వైద్య కళాశాలల పీపీపీ జీవో ప్రతులను దహనం చేశారు.
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం
వేణు మాట్లాడుతూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఎంత వ్యతిరేక వస్తున్నా, చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఆ విధానాన్ని విడనాడాలన్న ఉద్దేశంతో భోగిమంటల్లో ప్రతులను కాల్చి వేశామన్నారు. చంద్రబాబుకు మంచి బుద్ధి కలిగి ప్రజల మేలు కోసం పనిచేసేలా చూడాలని భగవంతుడిని ప్రార్థించామన్నారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య రక్షణ కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారన్నారు. వాటిని చంద్రబాబు ప్రభుత్వం పరిరక్షించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అన్నీ చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక ఏమీ చేయకుండా చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారన్నారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలన్నారు. హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి వేణు మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అన్ని వర్గాలనూ వంచించారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొందేశి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ జీవో ప్రతులను భోగిమంటల్లో కాల్చి వేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని కోరారు.


