డీలర్ల మాయాజాలం! | - | Sakshi
Sakshi News home page

డీలర్ల మాయాజాలం!

Jun 21 2025 3:27 AM | Updated on Jun 21 2025 3:27 AM

డీలర్ల మాయాజాలం!

డీలర్ల మాయాజాలం!

● హోల్‌సెల్‌ వ్యాపారుల్లో పలువురు రిటైల్‌ కూడా.. ● బిల్లుల ఎంట్రీలో జిమ్మిక్కులు ● నిఘా పెంచకపోతే యూరియా పక్కదారికి ఆస్కారం ● భీంపూర్‌ ఘటనే నిదర్శనం

జిల్లాలో ఎరువుల డీలర్ల వివరాలు..

హోల్‌సెల్‌ డీలర్లు 24

రిటైల్‌ లైసెన్స్‌ కలిగి

ఉన్న హోల్‌సెల్‌ డీలర్లు 21

రిటైల్‌ డీలర్లు 306

సాక్షి,ఆదిలాబాద్‌: భీంపూర్‌ మండలం అందర్‌బంద్‌లో మంగళవారం యూరియా లోడ్‌తో వెళ్తున్న లారీని టాస్క్‌ఫోర్స్‌ బృందం పట్టుకున్న విషయం తెలిసిందే. దీనిపై విచారణ కొనసాగుతోంది. రైతుమిత్ర అనే హోల్‌సెల్‌ ట్రేడర్స్‌ నుంచి ఈ సరుకు లోడైనట్లు గుర్తించారు. భీంపూర్‌ వ్యవసాయ అధికారి విచారణ చేపట్టారు. 18 మంది రైతులకు సరఫరా చేసేందుకే ఇది వెళ్తున్నట్లు నిర్ధారించారు. అయితే ట్రేడర్‌ మొదట మ్యానువల్‌గా బిల్లులు రూపొందించారు. సరుకును రవాణా చేసిన తర్వాత ఈపాస్‌లో నమోదు చేశారు. రైతుల ఆధార్‌ నంబర్‌, వేలిముద్రల పరిశీలన అనంతరం లోడ్‌ పక్కదారి పట్టలేదని స్పష్టం చేస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే.. రైతుమిత్ర ట్రేడర్స్‌కు ఇటు హోల్‌సెల్‌తో పాటు రిటైల్‌లోనూ లైసెన్స్‌ ఉంది. జిల్లాలో ఇలా హోల్‌సెల్‌తో పాటు రిటైల్‌లో లైసెన్స్‌ కలిగిన వారు అనేకం ఉన్నారు.

ట్రేడర్స్‌ లైసెన్స్‌ సస్పెన్షన్‌..

భీంపూర్‌ మండలంలో లారీ లోడ్‌తో పట్టుబడ్డ యూరియా విషయంలో ట్రేడర్‌ రైతుల పేరుపైనే దీన్ని సరఫరా చేసినప్పటికీ మొదట మ్యానువల్‌గా నమోదు చేయడం, ఆ తర్వాత ఆన్‌లైన్‌ ఎంట్రీ చేయడం వంటిది తప్పుగానే వ్యవసాయ శాఖ పేర్కొంటుంది. అయితే దీన్ని సరిదిద్దుకునే తప్పుగా ఆ శాఖ పేర్కొంటుంది. సాధారణంగా రెండు రకాల పొరపాట్లు ఉంటాయని.. అందులో సరిదిద్దుకునే తప్పు ఒకటిగా.. సరిదిద్దుకోలేని తప్పు మరొకటిగా శాఖాపరంగా పేర్కొంటామని వివరిస్తున్నారు. లైసెన్స్‌ లేకుండా ఎరువులు విక్రయించడం సరిదిద్దుకోలేని తప్పుగా పేర్కొంటామని అంటున్నారు. అయినప్పటికీ రైతుమిత్ర ట్రేడర్స్‌ లైసెన్స్‌ను సస్పెన్షన్‌ చేశారు. తద్వారా ఇతర ట్రేడర్స్‌ కూడా యంత్రాంగం నుంచి హెచ్చరిక జారీ చేశారు.

హోల్‌సెల్‌, రిటైల్‌ వారే..

జిల్లాలో హోల్‌సెల్‌ ట్రేడర్స్‌ కలిగిఉన్న వారిలో పలువురికి రిటైల్‌ షాపులు కూడా ఉండటం గమనార్హం. ఇలాంటి దగ్గరే అధికంగా అక్రమాలకు ఆస్కారం ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా లైసెన్స్‌ ఉన్నవారు సాధారణంగానైతే హోల్‌సెల్‌ నుంచి రిటైల్‌కు సరుకు వచ్చిన తర్వాతే రైతుల పేరిట ఈపాస్‌ ద్వారా విక్రయాలు జరపాలి. అయితే హోల్‌సెల్‌ గోదాం నుంచి నేరుగా సరుకును పక్కదారి పట్టించి అక్రమంగా విక్రయించేందుకు అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ అధికారులు నిరంతరం దృష్టి సారిస్తేనే అక్రమాలు అరికట్టేందుకు ఆస్కారం ఉంటుంది. లేనిపక్షంలో వ్యాపారులు ఆడిందే ఆట అన్నట్టుగా వ్యవహారం సాగేందుకు అవకాశం ఉంటుంది.

ఈపాస్‌లో ఎంట్రీ చేయాలి..

ఎరువుల విక్రయాలకు సంబంధించి ఈపాస్‌ మిషన్‌లో ఎంట్రీ చేసిన తర్వాతే విక్రయాలు చేయాలి. రైతుమిత్ర ట్రేడర్స్‌కు సంబంధించి లైసెన్స్‌ను సస్పెన్షన్‌ చేశాం. ఇతర ట్రేడర్లు కూడా నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవు.

– శ్రీధర్‌స్వామి, జిల్లా వ్యవసాయ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement