
‘ఉపాధి’ పనుల్లో నాణ్యత పాటించాలి
ఇంద్రవెల్లి: ఉపాధి హామీ పథకంలో రైతులకు అవసరమైన పనులు చేపట్టాలని, అలాగే పనుల్లో నాణ్యత పాటించాలని మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అధికారి కిరణ్చరణ్ పదే అన్నారు. మండలకేంద్రంలోని ఎస్టీ కాలనీ, ప్రబుద్ధనగర్, మిలింద్నగర్లో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను కేంద్ర బృందం సభ్యులు శుక్రవారం పరిశీలించారు. అలాగే ఇంద్రవెల్లి పరిధిలోని వ్యవసాయ భూములను సందర్శించి చేపట్టిన ఉపాధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయ భూముల్లో చేపట్టే పనులు రైతులకు మేలు చేకూరేలా ఉండాలన్నారు. ఇందులో కేంద్ర బృంద సభ్యులు రఘుకుమార్, మురళీధర్, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, ఏపీవో జాదవ్ శ్రీనివాస్, ఏఈ ప్రభుకిరణ్, టెక్నికల్ అసిస్టెంట్లు సంతోష్ జైస్వాల్, మహేందర్, ధమ్మనంద్, విఠల్, ప్రకాశ్ తదితరులున్నారు.
రైతుల ఖాతాల్లో
రూ.212.74 కోట్లు జమ
కైలాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద వ్యవసాయ ఆధారిత రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం నిధులు జమ అవుతున్నాయని కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది వానాకాలం సీజన్కు సంబంధించి జిల్లాలోని 1,68,238 రైతులకు గాను ప్రభుత్వం రూ.342.3 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. భూ విస్తీర్ణం ఆధారంగా శుక్రవారం వరకు 1,33,808 మంది రైతుల ఖాతాల్లో రూ.212.74 కోట్లను జమ చేసినట్లుగా వివరించారు.