
‘ఆదివాసీలపై దాడులు సరికాదు’
ఆదిలాబాద్రూరల్: ఆదివాసీలపై అటవీశాఖ అధికారుల దాడులను ఖండిస్తున్నామని తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోడం గణేశ్ అన్నారు. మావల మండలం బట్టిసావర్గాం శివారులోని కుమురంభీం గూడలో సోమవారం ఆయన మాట్లాడారు. ఆదివాసీలు సాగు చేస్తున్న వ్యవసాయ భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటడం, కందకాలు తవ్వడం వంటి చర్యలు సరికాదన్నారు. ఏటూరునాగారం మండలంలోని అటవీశాఖ పరిధిలో ఆదివాసీలు నివసిస్తున్న గుడిసెలను తొలగించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోనూ అటవీ అధికారుల దాడులు పెరిగాయన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలని, లేకుంటే తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్, విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వరుణ్, డివిజన్ అధ్యక్షులు గణపతి, తదితరులున్నారు.